ఫోర్‌ బ్రదర్స్‌ కోసమే ఫ్యూచర్‌సిటీ | KTR fires on CM Revanth Reddy family | Sakshi
Sakshi News home page

ఫోర్‌ బ్రదర్స్‌ కోసమే ఫ్యూచర్‌సిటీ

Oct 21 2024 3:27 AM | Updated on Oct 21 2024 3:27 AM

KTR fires on CM Revanth Reddy family

సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై కేటీఆర్‌ ధ్వజం 

వారి ‘రియల్‌’వ్యాపారం కోసమే ఈ ఎత్తుగడ 

ఫార్మా సిటీ రద్దు చేస్తే రైతుల భూములు తిరిగివ్వాలి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన నలుగురు సోదరుల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే ఫ్యూచర్‌ సిటీ నాటకం ఆడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రీన్‌ ఫార్మా ఏర్పాటు కోసం 14 వేల ఎకరాలు సేకరించిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోర్త్‌సిటీ, ఫ్యూచర్‌ సిటీ అని చెప్పుకొని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసి దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బొంగ్లూర్‌ సమీపంలో ఆదివారం నిర్వహించిన అలయ్‌బలయ్‌ (దసరా సమ్మేళనం) కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఫార్మా సిటీని రద్దు చేస్తే రైతుల నుంచి తీసుకున్న భూములు తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి ఫార్మాలో భూములు కోల్పోయిన 9 గ్రామాల్లో పర్యటించి రేవంత్‌రెడ్డి చేస్తున్న మోసాలను ప్రజలకు విడమరిచి చెబుతామన్నారు.   

పండుగలన్నీ కల తప్పాయి: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక బతుకమ్మ పండుగకు చీరలు లేవని, దసరా పండుగ కళ తప్పిందని, వినాయక చవితి కూడా పండుగలా లేదని కేటీఆర్‌ దుయ్యబట్టారు. ప్రభుత్వంలోకి రాక ముందు రేవంత్‌రెడ్డి మూడు పంటలకు రైతుబంధు ఇస్తానని చెప్పాడని, అయితే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాత్రం ఖరీఫ్‌కు పైసలు లేవని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 

బీఆర్‌ఎస్‌ అంటేనే భారత రైతు సమితి అని అభివర్ణించారు. చిట్టినాయుడు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంతోనే సరిపోయిందని ఎద్దేవా చేశారు.కార్యక్రమంలో మాజీ మంత్రి సబితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

‘ఎనుముల ఇంటెలిజెన్స్‌’టెక్నిక్‌!  
తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. 

రుణమాఫీ చేసినట్టు ఇచ్చిన ప్రకటనలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన చిత్రాన్ని వాడిన రీతిలోనే రుణమాఫీ జరిగిన రైతుల లెక్క విషయంలోనూ ముఖ్యమంత్రి ఏఐ టెక్నిక్‌ వాడారంటూ కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ పేర్కొన్న 40 లక్షల మంది రైతులు అనే సంఖ్య ఏఐ (ఎనుముల ఇంటెలిజెన్స్‌)తో రేవంత్‌రెడ్డి రూపొందించిందేనని ఎద్దేవా చేశారు.  

మలేíÙయా తెలంగాణ ఉత్సవాలకు ఆహ్వానం 
మలేషియా  తెలంగాణ అసోసియేషన్‌ ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే దశాబ్ది ఉత్సవాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఆ అసోసియేషన్‌ ఆహ్వానించింది. నవంబర్‌ 9వ తేదీన మలేíÙయాలోని కౌలాలంపూర్‌లో జరిగే ఈ ఉత్సవాలకు అక్కడి తెలంగాణవాసులు పెద్దఎత్తున హాజరవుతారని తెలిపింది. కేటీఆర్‌ను ఆయన నివాసంలో మలేíÙయా తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు తిరుపతి, మాజీఎమ్మెల్యే గాదరి కిషోర్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement