ఆరోపణలొస్తే ఎప్పుడైనా తనిఖీలు | JNTUH Clarification Inspections in private engineering colleges | Sakshi
Sakshi News home page

ఆరోపణలొస్తే ఎప్పుడైనా తనిఖీలు

Aug 25 2022 5:46 AM | Updated on Aug 25 2022 10:08 AM

JNTUH Clarification Inspections in private engineering colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలు నిరంతర ప్రక్రియ అని హైదరాబాద్‌ జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఏదైనా కాలేజీపై నిర్ధిష్ట ఆరోపణలువస్తే ఎప్పుడైనా తనిఖీలు చేస్తామని పేర్కొంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్త కోర్సులు ప్రవేశపెడితే, వాటికి సంబంధించిన ల్యాబ్‌లు, కోర్సులకు సరిపడా బోధన సిబ్బంది ఉన్నారా.. లేదా? అనేది పరిశీలించాకే అనుబంధ గుర్తింపు ఇస్తామని వెల్లడించింది. ఇంజనీరింగ్‌ కాలేజీల తనిఖీలపై ‘145 కాలేజీ లు.. మూడు రోజుల్లోనే తనిఖీలపై అనుమానా లు’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ప్రచురించిన కథనం లో వాస్తవం లేదని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుస్సేన్‌ స్పష్టంచేశారు. కాలేజీల్లో సిబ్బందికి వేతనాలు ఇస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించామని తెలిపారు.

కొన్నేళ్లుగా నడుస్తున్న పాత కాలేజీల్లో సివిల్, మెకానికల్‌ కోర్సులకు సంబంధించి ల్యాబొరేటరీలు, అధ్యాపకుల వ్యవస్థ ఉంటుందని, అలాంటప్పుడు వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. పెరిగిన కంప్యూటర్‌ కోర్సులకు  ల్యాబ్స్, బోధించే సిబ్బంది సక్రమంగా ఉన్నారా? లేదా? అనే అంశంపైనే తాము దృష్టిపెట్టినట్టు వివరించారు. నిజనిర్ధారణ కమిటీలు సమర్పించిన డేటాతో సంతృప్తిచెంది, కాలేజీల్లో ఉన్న లోపాలను యాజమాన్యాలకు వివరించకుండా, వారికి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని, అనుబంధ గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గతేడాది నుంచి నిజనిర్ధారణ కమిటీలు ఎత్తిచూపిన లోపాలను కాలేజీ మేనేజ్‌మెంట్లకు చూపి, వాటిని సరిచేసుకునేలా కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement