
ఈత కల్లుకు చిరునామా అంతర్గాం
ఎనిమిదెకరాల్లో దాదాపు 5 వేల చెట్ల పెంపకం
ఉపాధి పొందుతున్న గీత కార్మికులు
జగిత్యాల అగ్రికల్చర్: సాధారణంగా గ్రామాల్లో ఈత, తాటి చెట్ల కల్లు అమ్ముకుని గీత కార్మికులు జీవనోపాధి పొందుతుంటారు. కాగా, బీరు, బ్రాందీ, విస్కీ వంటి మద్యం గ్రామాల దరి చేరడంతో.. గీత కార్మికుల ఉపాధికి ఇబ్బందిగా మారింది. దీనికి తోడు, పల్లెల్లో ఈత, తాటి చెట్లు తగ్గుతుండటం.. కల్లు గీసే చెట్లకు రక రకాల తెగుళ్లు, పురుగులు సోకడంతో కల్లు పారడం లేదు, మరికొన్ని చోట్ల కల్లు పారే చెట్లే చనిపోతుండటం, గీత కార్మికుల ఉపాధికి దెబ్బగా మారింది.
దీంతో, అయా గ్రామాల్లోని ఈత, తాటి చెట్లను పంచుకుంటే.. ఒక్కొక్క కుటుంబానికి నాలుగైదు ఈత, తాటి చెట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామ గీత కార్మికులు వినూత్న పద్ధతిలో ఈత చెట్లను పెంచుతున్నారు. దానిద్వారా ఒకవైపు ఈత నీర, మరో వైపు ఈత కల్లు గీస్తూ.. మిగతా గ్రామాల గీత కార్మికులకు ఆదర్శంగా నిలిచారు. అంతర్గాం ఈత వనాన్ని గత ప్రభుత్వంలోని మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు సందర్శించడం విశేషం.
డ్రిప్ ద్వారా ఈత వనం పెంపకం
అంతర్గాం గీత కార్మికులందరూ ఐకమత్యంతో 100 మంది సభ్యులు దాదాపు 8 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసారు. కానీ ఆ భూమి ఏళ్ల తరబడి వృధాగా పడిఉంది. గ్రామంలోని ఈత, తాటి చెట్లు చాలా వరకు చనిపోయి ఉపాధికి ఇబ్బందిగా మారింది.
ఈ నేపథ్యంలో, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు జితేందర్ రావు నేతృత్వంలో గీత కార్మికులు వివిధ ప్రాంతాల్లోని ఈత వనాలను సందర్శించి, వృధా భూమిలో సంగారెడ్డి నర్సరీ నుండి దాదాపు 5 వేల ఈత మొక్కలను తెచ్చి నాటారు. వీటికి డ్రిప్ ద్వారా నీరు, పేడ వంటి సేంద్రియ ఎరువులను అందించారు. ఏటా ఈత చెట్ల కొమ్మలు భూమి మీదకు రాకుండా, ప్రూనింగ్ చేసారు. ఐదేళ్లలోనే ఈతవనం ఏపుగా పెరిగి, కల్లు గీతకు వచ్చింది.
ఈత కల్లుకు భలే డిమాండ్
ఈత వనంలోని దాదాపు 4 వేల చెట్ల వరకు కల్లు గీతకు రావడంతో, సంఘంలోని సభ్యులు కల్లు గీతకు తలా కొన్ని చెట్లు పంచుకున్నారు. గీత కార్మికులు తమకు కేటాయించిన చెట్ల నుంచి రోజూ కల్లు వచ్చేలా, కొన్ని చెట్లను ఒకరోజు, మరికొన్ని చెట్లను మర్నాడు గీయాలని నిర్ణయించుకున్నారు. రోజూ ఒక్కొక్క చెట్టుకు కనీసం 2 లీటర్ల కల్లు పారేలా చూసుకుంటున్నారు. రోజుకు కనీసం 1000–1500 లీటర్ల కల్లును ఉత్పత్తి చేస్తున్నారు. ఆ కల్లును అక్కడికక్కడే విక్రయిస్తూ మంచి ఉపాధి పొందుతున్నారు.
ఈతవనం ఎక్కువగా ఉండటం, ప్రస్తుతం కల్లు కూడా ఎక్కువగా పారుతుండటంతో, జగిత్యాల చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఉదయాన్నే కల్లు కోసం అంతర్గాం పరుగెత్తే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు, కల్లు ఉత్పత్తి ఎక్కువై, అమ్మలేని పరిస్థితుల్లో ప్రభుత్వ సహకారంతో పల్లె కల్లు పట్నానికి పంపాలనే ఆలోచనలు సైతం చేస్తున్నారు. కల్లు ద్వారా అదాయం అంతంతే వస్తుండటంతో, గీత కార్మికులు సమావేశమై ఈతనీరాను సైతం అమ్మాలని యోచిస్తున్నారు.
ఈత నీరా వైపు గీతన్నల చూపు
అంతర్గాంలో గీతన్నలు గీసిన కల్లు ద్వారా అయితే లీటర్కు రూ.50–రూ.60 వరకు వస్తుంది, ఈత నీరా అయితే లీటర్ రూ.100 వరకు అమ్ముతున్నారు. వేసవిలో చల్లదనానికి ఈతనీరాను తాగుతుంటారు. కొత్త కుండల్లో ఈతనీరాను గీస్తారు. ప్రభుత్వం సైతం అనుమతి ఇవ్వడంతో, నాలుగేళ్ల క్రితం, జిల్లా ఎక్సైజ్ అధికారులు ఈతనీరాను ప్రారంభించారు. పదిహేను లీటర్లకు పైగా ఆర్డర్ ఇస్తే.. ఇంటికి సైతం పంపగలమంటూ గీత కార్మికులు చెబుతున్నారు.
ఈత నీరాను తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయంటూ వైద్యులు సైతం స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం ప్రాధాన్యం ఇస్తుండటంతో, జిల్లా కేంద్రంలో ఉదయం వేళల్లో ఓ స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించాలని కూడా యోచిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేయాలని ప్రచారం చేయాలని గీతన్నలు భావిస్తున్నారు.