ప్రేమ.. పరువు.. ఆత్మహత్య.. హత్య! | inter caste marriage Life Ends in karimnagar | Sakshi
Sakshi News home page

ప్రేమ.. పరువు.. ఆత్మహత్య.. హత్య!

Mar 29 2025 8:52 AM | Updated on Mar 29 2025 9:10 AM

inter caste marriage Life Ends in karimnagar

దారుణాలకు దారితీస్తున్న కులాంతర ప్రేమలు 

కలకలం రేపుతున్న ప్రేమికుల హత్యలు, ఆత్మహత్యలు

తాజాగా సాయికుమార్‌ను వెంటాడి నరికి చంపిన వైనం

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఉత్తరాది కల్చర్‌ 

మరోసారి పరువు హత్యలపై జోరుగా చర్చ

ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

.. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం.

పంతాలతో కుటుంబాలు నాశనం
సామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.

ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు
మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది.

ఇల్లందకుంట యువకుడు, నిర్మల్‌ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్‌లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

2024 ఏప్రిల్‌లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది.

2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.

2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది.

2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. 

2017లో మంథనిలో మధుకర్‌ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది.

2016లో తిమ్మాపూర్‌లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది.

ఆలోచన తీరు మారాలి 
కులం అహంకారంతో జరిగే దారుణాలతో ప్రాణాలుపోతున్నాయి. టెక్నాలజీలో ముందున్న మనం ఆధునికంగా ఆలోచించలేక పోతున్నాం. ఉన్నత చదువులు చదువుకునే..యువత కూడా ప్రేమించుకోవడం.. కాదన్నారని ప్రాణాలు తీసుకోవడం తగదు. ఈ ఘటనలకు కేవలం ఆలోచన తీరే కారణం. తీరుమారితే విపరీత ధోరణులు మారుతాయి. 
– ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత,సోషియాలజీ విభాగం అధిపతి, శాతవాహన వర్సిటీ

కుల వివక్షపై అవగాహన కల్పించాలి 
సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నా కుల,మత భేదాలు గ్రామాల్లో అలాగే కొనసాగుతున్నాయి. కులాల మధ్య వైరుధ్యాలు పెరిగేలా ప్రభుత్వాలు కులాల ఆధారంగా ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజల మధ్య దూరాలను పెంచుతున్నాయి. పిల్లల ప్రేమ కన్నా పరువు, పట్టింపులే ఎక్కువ అనే భావన తొలిగేలా,  కులవివక్షపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
– కల్లెపల్లి ఆశోక్, కేవీపీఎస్‌ 
 

:::సాక్షిప్రతినిధి, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement