20 నెలల్లో ఇది మేం తెచ్చిన మార్పు: పంద్రాగస్టు ప్రసంగంలో సీఎం రేవంత్‌ | Independence Day 2025: Telangana CM Hoists National Flag Speech At Golconda Fort | Sakshi
Sakshi News home page

ఇది 20 నెలల్లో మేం తెచ్చిన మార్పు: పంద్రాగస్టు ప్రసంగంలో సీఎం రేవంత్‌

Aug 15 2025 10:15 AM | Updated on Aug 15 2025 11:35 AM

Independence Day 2025: Telangana CM Hoists National Flag Speech At Golconda Fort

హైదరాబాద్‌, సాక్షి: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. గోల్కొండకోటలో జరిగిన వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. కోటపై జెండా ఎగరేసి.. పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలో 20 నెలల ప్రజాపాలనలో సాధించిన పురోగతిని ఆయన రాష్ట్ర ప్రజలకు వివరించారు. 

భారత ప్రజలకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకుశిరస్సు వంచి నమస్కరిస్తున్నా.  గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయటి శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచాం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో  ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం.

ఆనాడు  పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్ల మంది భారతీయులను ఐక్యం చేసి, లక్ష్యం వైపు నడిచేలా చేసింది. కేవలం ప్రసంగాలు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు... ఆ దిశగా కార్యచరణ తీసుకుని దేశ పురోగతికి బలమైన పునాదులు వేశారు. దృఢమైన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర దేశంగా భారత్ ను నిలబెట్టడంలో గొప్ప రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. ఆ నాటి స్ఫూర్తిని, ఆ మహనీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ..

👉తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యాలతో మేం పరిపాలన సాగిస్తున్నాం. స్వాతంత్ర్యం సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. శూన్యం నుండి మన ప్రయాణం మొదలైంది. శిఖరాలే లక్ష్యంగా సంకల్పం తీసుకుని మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ఈ రోజు మనం చూస్తున్న ఆధునిక భారతం ఐదేళ్లలోనో..  పదేళ్లలోనో సాధించిన విజయం కాదు. దీని వెనుక 79 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. ఎందరో గొప్ప నాయకుల త్యాగం, చెమట, రక్తం ఉంది.

ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మనం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం. వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడం మన ముందున్న కర్తవ్యం. ఆ బాధ్యత నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను. ఆ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది.

👉2023 డిసెంబర్ 7న  మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నాం. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం.

👉కుల గణనతో బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించాం. ఇవి గొప్ప నిర్ణయాలు మాత్రమే కాదు.. అత్యంత సాహసోపేత నిర్ణయాలు కూడా. ఒక వైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. మరో వైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోంది.

👉మా ఆలోచనలో స్పష్టత ఉంది.. అమలులో పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేం ఎంచుకున్నాం. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టాం. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన.. దీనికి చరిత్రే సాక్ష్యం.

👉70 ఏళ్లుగా PDS వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ఈ రోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు. ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు.. ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పథకం. ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించా. ఆ రోజు వారి కళ్లలో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుంటుంది.

👉రేషన్ కార్డు.. ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా.. భావోద్వేగం. ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు పదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు పరిష్కారం లభించింది. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో.. రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. పాడుబడి, మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. పేదవాడి ఆశలు, ఆకలి తీర్చే భరోసా కేంద్రంగా నేడు గ్రామాల్లో రేషన్ షాపు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఇది మేం తెచ్చిన మార్పు.

👉తెలంగాణ రైతుకు 2022, మే 6న వరంగల్ వేదికగారూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మేం మాట ఇచ్చాం. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర రాశాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా... రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించాం. కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. రాష్ట్రంలోని 70 లక్షల, 11 వేల, 184 మంది రైతులకు ఈ సాయం అందించాం. 

👉కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం. పండించిన పంటను కొనుగోలు చేస్తూ మేం ఉన్నామన్న భరోసా ఇస్తున్నాం. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీని కోసం  రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం. ఇది రైతుల పట్ల, వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాశాం. అన్నదాతల సంక్షేమానికి 1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. 

👉తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏ ప్రాంతాల్లో 22,016 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. 

👉సామాజిక న్యాయం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. స్థానిక సంస్థలలో...విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించుకున్నాం. 50 రోజుల పాటు సమగ్ర కులగణనను యజ్ఞంలా చేపట్టాం. దీని ఆధారంగా వారికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం. మనం పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరోసారి డిమాండ్ చేస్తున్నాం. 

👉దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను  మూడు గ్రూపులుగా విభజించాం. గ్రూప్- 1 లో 15, గ్రూప్ -2 లో 18, గ్రూప్ -3 లో 26 కులాలను చేర్చాం. ప్రతి ఏటా ఫిబ్రవరి 4ను ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’ గా జరుపుకోవాలని  నిర్ణయించాం.

👉మసకబారిన ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచాం. 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం..

👉మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి అనే నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మేం పని చేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు ఆదా అయ్యింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం మా విజయాలలో మరో మైలురాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చింది.

👉యువత తెలంగాణ శక్తికి ప్రతీక. గడచిన పదేళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. ఆ కుట్రను మేం చేధించాం. ఇవ్వాళ తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం మూల మూలలా నిశితంగా నిఘా పెట్టింది. డ్రగ్స్ మాయగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.

👉మాపై చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలే తిప్పికొట్టాలి. ఏవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా లక్ష్యాన్ని నెరవేర్చుతాం. సెంటిమెంట్ తో రాజకీయ లాభం పోందేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నదీ జలాలలో రాష్ట్ర వాటా సాధిస్తాం. కృష్ణా పెండింగ్ ప్రాజెక్టులు సాధ్యమయినంత త్వరగా పూర్తి చేస్తాం. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నాం. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోం.

గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే.. శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుంది. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా.. ఆ ఎత్తులను చిత్తు చేస్తాం. దృష్టి మరల్చేందుకు సెంటిమెంట్ రగిలించాలన్న కొందరి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కుట్రలను ఛేదించి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తాం.

మన బలం హైదరాబాద్. ప్రపంచ వేదికపై మన బ్రాండ్ హైదరాబాద్. ఈ బలాన్ని మరింత బ్రాండింగ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించాం. అందుకే పలు అంతర్జాతీయ ఈవెంట్లను హైదరాబాద్ లో నిర్వహించేలా నిర్ణయాలు తీసుకున్నాం. ఇటీవల 72వ ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. దీంతో మన చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను ప్రపంచ దేశాలకు చూపించే అవకాశం కలిగింది

👉దేశంలోనే మొదటి సారి...గత ఏడాది హైదరాబాద్ లో వరల్డ్ గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) సదస్సు నిర్వహించాం. భారత్ ఫ్యూచర్ సిటీలో AI సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నాం. గ్లోబల్ రైస్ సమ్మిట్ ను కూడా మనం హైదరాబాద్ లో నిర్వహించుకున్నాం. మన ప్రభుత్వం నిర్వహించిన బయోఏషియా సదస్సుకు 50 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అంతర్జాతీయ రాజకీయ సదస్సు భారత్ సమ్మిట్– 2025 ను మనం హైదరాబాద్ లో నిర్వహించాం. ఈ అన్నీ వేదికల నుండి మనం తెలంగాణ విజన్ ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాం. అదే “తెలంగాణ రైజింగ్ – 2047”.

👉వచ్చే డిసెంబర్‌లో తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నాం. 2047 నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకుంటుంది. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే మా సంకల్పం. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్‌ 2047’.

👉2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు… ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ఇది యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.

👉మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్ లో విస్పష్టంగా ఉండబోతోంది. వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ను... స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్ ఆవిష్కరిస్తుంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదారాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్  డాక్యుమెంట్ ఇస్తుంది.

👉అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ... ఆధునిక ప్రపంచానికి గేట్ వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో తెలంగాణ రైజింగ్ – 2047 లో విస్పష్టంగా చెప్పబోతున్నాం. 2047 నాటికి దేశ ప్రగతిలో తెలంగాణది కీలక పాత్రగా చేయడమే మా సంకల్పం అని సీఎం రేవంత్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement