
సాక్షి,రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిడేడు గ్రామానికి చెందిన ఓ బాలిక ఆర్టీసీ బస్సులు సరిగా నడవడంలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది. తాను పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడపడం లేదనే విషయాన్ని సీజేఐకి ఓ లేఖ ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం బాలిక వైష్ణవి 8వ తరగతి చదువుతోంది.
అయితే విద్యార్థిని అభ్యర్థనపై స్పందించిన సీజేఐ.. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులను తక్షణమే పునరుద్ధరించినట్లు వెల్లడించారు. అదేవిధంగా బస్సుల పునరుద్ధరణపై అప్రమత్తం చేసినందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు.