
మరోసారి బెగ్గర్ ఫ్రీ సిటీ!!
గతంలో విఫలం
ఇప్పుడు మళ్లీ ప్రారంభం
చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ
నాలుగు రోజులుగా ముమ్మరం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మరోసారి బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులను గుర్తించి షెల్టర్ హోంలకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు బల్దియా ప్రకటించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలమేరకు ఇప్పటికే అన్ని సర్కిళ్లలో.. ప్రధానంగా బషీర్ బాగ్, సెక్రటేరియట్, నాంపల్లి, బేగంబజార్ తదితర ప్రాంతాల్లోని జంక్షన్లలోని యాచకులు, ఫుట్పాత్లపై ఉండేవారిని గుర్తించి జీహెచ్ఎంసీ షెల్టర్ హోంలకు తరలిస్తున్నారు. మిగిలిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిని తమ సొంత ఊళ్లకు, నివాసాలకు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా ముమ్మరంగా నిర్వహిస్తున్నా రు. ప్రధాన కూడళ్లు, మతపరమైన ప్రదేశాలలో భిక్షాటన చేసే వారి గురించి సమాచారం అందుకొని, వారిని వైద్య పరీక్షల తర్వాత పోలీసుల సహకారంతో జీహెచ్ఎంసీ షెల్టర్ హోంలకు తరలిస్తున్నారు.
221 మంది గుర్తింపు..
ఇప్పటి వరకు 221 మందిని గుర్తించారు. వీరిలో 173 మంది పురుషులు, 37 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 19 మందిని జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న షెల్టర్ హోంలకు తరలించగా, మిగిలిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారివారి కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు. యాచకులు, ఫుట్పాత్లపై ఉండేవారిని షెల్టర్ హోంలకు లేదా వారి కుటుంబ సభ్యుల వద్దకు తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ యూసీడీ అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతాల్లో ఎక్కువగా..
తాజాగా నాంపల్లి మెట్రోస్టేషన్,ఎస్సార్నగర్ మెట్రో జంక్షన్, శిల్పారామం, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ఎక్కువ మందిని గుర్తించారు.
సాగేనా.. ఆగేనా?
నగరాన్ని బెగ్గర్ ఫ్రీ చేయడమనేది ప్రహసనంగా మారింది. గతంలోనూ ప్రయత్నాలు చేసినా మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. 2017 నవంబర్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న (ప్రస్తుతం సైతం ఆయనే) డొనాల్డ్ ట్రంప్ కుమార్తె నగరానికి వచ్చే ముందు యాచకులు లేకుండా చేశారు. మున్ముందు బిచ్చగాళ్లు అనేవాళ్లు లేకుండా చేస్తామని ప్రకటించి కొన్ని నెలల వరకు కొనసాగించారు. ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో యాచన చేస్తున్న వారిని నగర శివార్లలోని చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి తరలించారు. ఈ వృత్తిని నిర్మూలిస్తామని అప్పటి మేయర్ బొంతు రామ్మోహన్ సైతం ప్రకటించారు. వారిలో చాలామంది ఫేక్ అని, దాదాపు మూడువేల మంది పసిపిల్లలతో దందా నడిపిస్తున్నారని, దాన్ని అరికడతామన్నారు. నిజంగా యాచన తప్ప ఏపనీ చేయలేని అసహాయులను అన్నివిధాలా ఆదుకుంటామని, పనిచేసే శక్తి ఉన్నవారికి అవసరమైన వారికి తగిన శిక్షణ నిప్పించి ఉపాధి కలి్పస్తామన్నారు. కానీ.. అమలు కాలేదు. ఇప్పుడు మరోసారి బెగ్గర్ ఫ్రీ నగరంగా మార్చేందుకు చర్యలు ప్రారంభించారు. ఏమవుతుందో కొన్నాళ్లయితే కానీ తెలియదు.
రూ. 300 కోట్లకు పైగా సంపాదన
వివిధ సర్వేల మేరకు నగరంలోని యాచకులు ఏటా రూ. 300 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు.
నకిలీలే అధికం..
గ్రేటర్లో ఇరవై వేల మందికి పైగా ఈ వృత్తిలో ఉండగా, వీరిలో కేవలం పదిశాతం మాత్రమే నిజంగా అశక్తులు. బిహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన యువకులు కూడా వీరిలో ఉన్నారు. జంక్షన్లు, ప్రార్థనా మందిరాలు, ట్రాఫిక్ సిగ్నళ్లు వీరి అడ్డాలు. వీరిలో చాలామందికి మద్యం, ఇతరత్రా మత్తుపదార్థాల వ్యసనం ఉంది. ఈ ఊబిలో బందీలుగా ఉన్న బాలలు రోజుకు సగటున రూ. 500 వరకు ఆర్జిస్తున్నారు. ఈ పని చేస్తున్న మహిళల్లో కొందరు పగటి పూట యాచన చేస్తూ, రాత్రి వేళల్లో సెక్క్ వర్కర్లుగా మారుతున్నారు. యాచకుల్లో 90 శాతానికి పైగా పునరావాసం కలి్పస్తామన్నా, వృద్ధాశ్రమాలు/విద్యాసంస్థలు/ ఆశ్రమాలు/ అనాథ శరణాలయాల్లో చేరుస్తామన్నా నిరాకరిస్తున్నట్లు వివిధ సర్వేల్లో వెల్లడైంది.