కాంక్రీట్, నాన్ కాంక్రీట్ కేటగిరీల్లో నిర్మాణ విలువలు 25 శాతం పెంపు
చదరపు అడుగుకు కనీసం రూ.150 పెంచిన ప్రభుత్వం
పట్టణ ప్రాంతాల్లో ఆర్సీసీ నిర్మాణాలపై చదరపు అడుగుకు రూ.250
గ్రామీణ ప్రాంతాల్లో రూ.200 పెరుగుదల.. నాన్ ఆర్సీసీ అన్నిచోట్లా రూ.150 పెంపు
నేరుగా కార్డ్ సాఫ్ట్వేర్లో అప్లోడ్
ఈ నెలలోని మొదటి 4 రోజుల్లోనే 22 వేల రిజిస్ట్రేషన్లు.. సగటున రోజుకు 5 వేల పైమాటే
కొత్త విలువలు అమల్లోకి వచ్చే ముందు రోజు ఏకంగా 8,200కు పైగా లావాదేవీలు
కొత్త విలువలు అమల్లోకొచ్చాక సాఫీగానే కార్యకలాపాలు
తొలిరోజు 3 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు వెల్లడిస్తున్న గణాంకాలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణలో భాగంగా నిర్మాణ విలువలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. అయితే ఈ నిర్మాణ విలువల సవరణ ప్రక్రియపై పెద్దగా చర్చ జరగకుండానే కొత్త విలువలు అమల్లోకి వచ్చిన రోజున నేరుగా కార్డ్ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసింది.
కొత్త విలువల ప్రకారం రీయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ (ఆర్సీసీ) కేటగిరీలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.250, రూ.200 చొప్పున సవరించగా, నాన్ ఆర్సీసీ కేటగిరీలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ నిర్మాణ విలువను చదరపు అడుగుకు రూ.150 చొప్పున సవరించింది. కాగా, కొత్త విలువలు అమలైన తొలిరోజు రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు సాఫీగానే సాగిపోయాయి. చిన్నచిన్న సాఫ్ట్వేర్ సమస్యలు వచ్చినా ఉన్నతాధికారులు వెంటనే స్పందించారని సమాచారం.
చివరి రోజు భారీగా లావాదేవీలు
పాతవిలువలు అమల్లో ఉన్న చివరి రోజు గురువారం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఒక్కరోజే వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి 8,200కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. వ్యవసాయ భూముల రిజి్రస్టేషన్లతో కలిసి ఈ సంఖ్య 10,700 దాటడం గమనార్హం. ఈ నెలలో తొలి నాలుగు రోజుల్లోనే 22వేలకు పైగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయి. వ్యవసాయ భూముల లావాదేవీలతో కలిపితే ఈ సంఖ్య 34 వేలకు చేరింది. అంటే సగటున రోజుకు 8,500 వరకు లావాదేవీలు జరిగాయన్నమాట.
అయితే వ్యవసాయేతర భూములు, ఆస్తుల లావాదేవీలు మాత్రం సగటున రోజుకు 5 వేలు జరిగాయి. వాస్తవానికి సాధారణ రోజుల్లో రోజుకు సగటున 2 వేల వరకు వ్యవసాయేతర లావాదేవీలు జరుగుతుండగా, విలువల సవరణకు నాలుగు రోజుల ముందు సగటున 5 వేలకు పైగా లావాదేవీలు జరగడం గమనార్హం. కొత్త విలువలు అమలైన శుక్రవారం తొలిరోజు 3,200కు పైగా వ్యవసాయేతర లావాదేవీలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.
భూభారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం పాత విలువలు అమల్లో ఉన్న చివరి రోజు గురువారం 3,506 దరఖాస్తులు వచ్చాయి. అందులో 2,515 లావాదేవీలను పూర్తి చేశారు. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో మొత్తం 17 వేలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 12 వేల వరకు లావాదేవీలు పూర్తయ్యాయి. అంటే భూభారతి పోర్టల్లో కూడా ఈ నెలలో సగటున రోజుకు 3వేలకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయన్నమాట. కొత్త విలువలు అమల్లోకి వచ్చిన తర్వాత తొలి రోజు శుక్రవారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం 3వేల వరకు దరఖాస్తులు రాగా, అందులో 1,500 వరకు లావాదేవీలు పూర్తి చేసినట్టు సమాచారం.

విలువల సవరణపై అధికారిక ప్రకటన
రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువలను ఎలా సవరించామన్న దానిపై స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం రాష్ట్రంలోని 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని వాణిజ్య అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్ విలువలను 11 శాతం తగ్గించారు.
⇒ రంగారెడ్డి (ఆర్ఓ), శేరిలింగంపల్లి, గండిపేట, శంషాబాద్, మేడ్చల్ (ఆర్ఓ), వల్లభ్నగర్, బాలానగర్, కూకట్పల్లి సబ్ రిజి్రస్టార్ కార్యాలయాల పరిధిలో ప్రస్తుతం కమర్షియల్ అపార్ట్మెంట్స్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఒక చదరపు అడుగు రూ.7,300, మిగతా ఫ్లోర్లలో ఒక చదరపు అడుగు రూ.6,600 ఉండగా ఇప్పుడు అన్నీ ఫ్లోర్లలో ఒకే విలువæ రూ.6,600 గా నిర్ణయించారు.
⇒ వల్లభ్నగర్లో గ్రౌండ్ ఫ్లోర్ ఒక చదరపు అడుగు రూ.8,600 ఉండగా, మిగతా ఫ్లోర్లలో రూ.7,800 ఉండగా ఇప్పుడు అన్నీ ఫ్లోర్లలో రూ.7,800లుగా నిర్ణయించారు.
⇒ నివాస అపార్ట్మెంట్లకు సంబంధించి చిక్కడపల్లి, లోయర్ ట్యాంక్బండ్, హిమాయత్నగర్, హైదర్గూడ లాంటి ప్రాంతాల్లో పెంచలేదు.
⇒ బంజారాహిల్స్లో ఉన్న రూ.4,500, ఫిల్మ్నగర్లో ఉన్న రూ.4,800 విలువను యథాతథంగా కొనసాగించారు.
⇒ పుప్పాలగూడ, నార్సింగి, ఆదిబట్లలో ఒక చదరపు అడుగు రూ.2,200 నుంచి రూ.2,700కు పెంచారు.
⇒ బంజారాహిల్స్లో కమర్షియల్ అపార్ట్మెంట్స్కు చదరపు అడుగు రూ.7,600 నుంచి రూ.8,400 కు పెంచారు. మొత్తంగా నివాస, వాణిజ్య అపార్ట్మెంట్స్లో 10 నుంచి 20 శాతం వరకు మాత్రమే విలువలు సవరించారు.
⇒ ఆదిలాబాద్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, కరీంనగర్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్లగొండ, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాల్లోని 65 గ్రామాల్లో వ్యవసాయ భూముల విలువలు పెంచలేదు.
⇒ మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ఉప్పల్, కాప్రా, పటాన్చెరు, హయత్నగర్లలో 15 శాతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, సరూర్నగర్, శేరిలింగంపల్లిలలో 25 శాతం పెంచారు.
⇒ ఖాళీ ప్లాట్ల విషయానికి వస్తే ఆమనగల్లు మున్సిపాలిటీలో గజం విలువ రూ.3,200, రావిర్యాలలో రూ.4,900, పుప్పాలగూడలో రూ.36,800, నార్సింగిలో రూ.27,000, కోకా³పేటలో రూ.47,600, గండిపేటలో రూ.22,600, అత్తాపూర్లో రూ.30,500, కందుకూరులో రూ.4,900, బంజారాహిల్స్లో రూ.1,16,000 (కమర్షియల్), ఉప్పల్లో రూ.25,200, హబ్సిగూడలో రూ.46,800, జనగాంలో రూ.3,200, వేములవాడలో రూ.4,800, నాచారంలో రూ.25,400, నాగోల్లో రూ.25,200, బైరామల్గూడలో రూ.24,300గా నిర్ణయించినట్టు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ వెల్లడించింది.


