సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు వీరంగం సృష్టించడం స్థానికంగా కలకలం రేపింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంధమల్ల అశోక్ పోలీసు స్టేషన్ లోనే రక్షక భటులకు వార్నింగ్ ఇచ్చారు. నా ఇసుక ట్రాక్టర్లు ఎలా ఆపుతారా అని పోలీసులను బెదిరించారు. ఒళ్లు పగులుతుంది నీ సంగతేంటో చూస్తానని పోలీస్ స్టేషన్లో నానా హంగామా సృష్టించాడు.
కాగా గత కొంతకాలంగా ఆలేరు, బిక్కేరు వాగు, రాజపేట, మోటకొండూరు ప్రాంతల నుంచి ఇసుక మట్టి అక్రమ రవాణా జరుగుతుంది. మోటకొండూరు మండలం వర్టూరు చెరువు నుంచి కూడా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇసుక రవాణాను అడ్డుకున్న వారిని సైతం కొంతమంది నేతలు ఇలానే బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆలేరు కాంగ్రెస్ నాయకుడే ఇసుక అక్రమ రవాణాకు అండదండలు అందించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ బెదిరింపుల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


