ఆటా మహాసభల్లోని ఒక కార్యక్రమంలో దండలు మార్చుకుంటున్న భట్టి దంపతులు
ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం
పారిశ్రామికంగా, సామాజికంగా చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ వెన్నంటి ఉంటాం
‘ఆటా’ మహాసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు పెట్టుబడులతో రావాలని ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్), ఎన్నారైలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్ బాల్టిమోర్లో జరిగిన 19వ ఆటా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవాసులనుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసుల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధ హోదా కలిగిన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
వారు సంపాదించిన విజ్ఞానం, అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలని కోరారు. పారిశ్రామికంగా, సామాజికంగా చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ వెన్నంటి ఉంటామని చెప్పారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని చెప్పారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తూ సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు అందిస్తున్నామని, ప్రవాసులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నేడు తెలంగాణకు పెద్ద ఆస్తులుగా మారాయని గుర్తుచేశారు.
ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డును దాటి మిగతా జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామని, వాటిని అనుసంధానం చేస్తూ కొత్తగా 36 రేడియల్ రోడ్లను ప్లాన్ చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు దీటుగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆ ప్రాంతాన్ని ఆనుకుని సరికొత్తగా ’ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వివరించారు. మూసీ నది పునరుజ్జీవం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు.
ప్రపంచంలోని ఎక్కడున్న తెలంగాణ వాసులైనా.. రాష్ట్రంలో ఉన్న తమ కుటుంబసభ్యుల సమస్యలనైనా ప్రత్యేక వ్యవస్థ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కొనసాగుతున్న నేపథ్యంలో విదేశాల్లో ఉన్న తెలంగాణ పౌరులు ఆన్లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు.


