రుణం తీర్చుకునేందుకు పెట్టుబడులతో రండి | Deputy CM Bhatti Vikramarka Participates In ATA Convention | Sakshi
Sakshi News home page

రుణం తీర్చుకునేందుకు పెట్టుబడులతో రండి

Aug 4 2026 1:26 AM | Updated on Aug 4 2026 1:26 AM

Deputy CM Bhatti Vikramarka Participates In ATA Convention

ఆటా మహాసభల్లోని ఒక కార్యక్రమంలో దండలు మార్చుకుంటున్న భట్టి దంపతులు

ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం

పారిశ్రామికంగా, సామాజికంగా చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ వెన్నంటి ఉంటాం

‘ఆటా’ మహాసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు పెట్టుబడులతో రావాలని ఆటా (అమెరికన్‌ తెలుగు అసో­సి­­యే­షన్‌), ఎన్నారైలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా­ర్క పిలుపునిచ్చారు. అమెరికాలోని మేరీల్యాండ్‌ స్టేట్‌ బాల్టి­మోర్‌­లో జరిగిన 19వ ఆటా మహాసభలకు ఆయన ముఖ్య అతి­థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవాసుల­ను­ద్దేశించి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవా­సుల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధ హోదా కలిగిన ప్రత్యే­క వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభు­త్వం ఆలోచి­స్తోం­ద­న్నారు. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాల­న్నారు.

వారు సంపాదించిన విజ్ఞానం, అనుభవాన్ని రాష్ట్రా­భివృద్ధికి విని­యో­గించాలని కోరారు. పారిశ్రామికంగా, సా­మాజికంగా చేప­ట్టే ప్రతి కార్యక్రమంలో మీ వెన్నంటి ఉంటా­మని చెప్పా­రు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డా­ల­ర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నా­యకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందు­కెళ్తోందని చెప్పారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తూ సింగిల్‌ విండో విధానంలో అన్ని అనుమతులు అందిస్తున్నా­మని, ప్రవాసులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు­నిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర­రెడ్డి నిర్మించిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానా­శ్రయం నేడు తెలంగాణకు పెద్ద ఆస్తులుగా మారాయని గుర్తు­చేశారు.

ఇప్పుడు ఔటర్‌ రింగ్‌ రోడ్డును దాటి మిగతా జిల్లాలను కలుపుతూ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మిస్తున్నామని, వాటిని అనుసంధానం చేస్తూ కొత్తగా 36 రేడియల్‌ రోడ్లను ప్లాన్‌ చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు దీటుగా ప్రపంచస్థాయి ప్రమా­ణాలతో ఆ ప్రాంతాన్ని ఆనుకుని సరికొత్తగా ’ఫ్యూచర్‌ సిటీ’ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వివరించారు. మూసీ నది పునరుజ్జీవం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో హైదరా­బాద్‌ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు.

ప్రపంచంలో­ని ఎక్కడున్న తెలంగాణ వాసులైనా.. రాష్ట్రంలో ఉన్న త­మ కుటుంబసభ్యుల సమస్యలనైనా ప్రత్యేక వ్యవస్థ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కొన­సాగుతున్న నేపథ్యంలో విదేశాల్లో ఉన్న తెలంగాణ పౌరులు ఆన్‌లైన్‌ ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement