మోదీ చేస్తే గొప్ప... మేం చేస్తే తప్పా? | CM Revanth Reddy at the inauguration of Hydra Police Station | Sakshi
Sakshi News home page

మోదీ చేస్తే గొప్ప... మేం చేస్తే తప్పా?

May 9 2025 1:18 AM | Updated on May 9 2025 1:18 AM

CM Revanth Reddy at the inauguration of Hydra Police Station

గుజరాత్, యూపీల్లో నదుల పునరుద్ధరణ జరుగుతోంది 

అదే పని ఇక్కడ మూసీలో చేస్తుంటే కొందరికి నచ్చట్లేదు 

ఆక్రమణల్ని తొలగిస్తుంటే రియల్‌ ఎస్టేట్‌ డౌన్‌ అంటారు 

ఆ 400 ఎకరాలను అభివృద్ధి చేద్దామంటే ప్రకృతి విధ్వంసం అంటున్నారు 

 హైడ్రా ఠాణా ప్రారంబోత్సవంలో  సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌లో సబర్మతి, యూపీలో గంగా, ఢిల్లీలో యమునా నదుల పునరుద్ధరణ కొందరికి గొప్పగా వినిపిస్తోందని.. అలాంటప్పుడు తెలంగాణ ప్రజల కోసం మూసీ నదిని ప్రక్షాళన చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మనం గొప్పగా బతకవద్దా? అని నిలదీశారు. ప్రధాని మోదీ చేస్తే గొప్ప ఎలా అవుతుందో.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పు ఎలా అవుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు.

హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌ వద్ద ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) పోలీసుస్టేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల వల్ల తలెత్తుతున్న వరదలు, హైడ్రా ఆవశ్యకత సహా వివిధ అంశాలపై స్పందించారు. 

హైడ్రా కూల్చడానికే కాదు...  
రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది కేవలం కూల్చడానికి మాత్రమే కాదని.. నిర్మాణాలు చేపట్టేందుకు కూడానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆక్రమణలకు పాల్ప డే వాళ్లు ఎంత గొప్ప వాళ్లయినా చట్టం ముందు సమానులే నని నిరూపించడానికే హైడ్రా తీసుకుకొచ్చినట్లు స్పష్టం చేశా రు. హైదరాబాద్‌లో 940 చెరువులకుగాను 491 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. పెద్దపెద్ద నాలాలు మూసుకుపోయాయి. చిన్న వర్షానికే కాలనీలు మునిగిపోతున్నాయని.. రోడ్లపై వరదనీటితో గంటల తరబడి ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడుతున్నాయన్నారు. వాటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నించారు. 

అక్కడ అలా.. ఇక్కడ ఇలా అంటారేంటి? 
చెరువులను కాపాడినా, నాలాల ఆక్రమణలు తొలగించినా, అక్రమ నిర్మాణాలను పడగొట్టినా, మూసీని పునరుద్ధరించాలని చూసినా రియల్‌ ఎస్టేట్‌ పడిపోతోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ‘రియల్‌ ఎస్టేట్‌ పెంచుదామని ఐఎంజీ భారత్‌ అనే ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టిన 400 ఎకరాలను 20 ఏళ్ల తర్వాత వెనక్కు తెచ్చాం. రూ. 50 వేల కోట్ల పెట్టుబడితో లక్ష ఉద్యోగాలు వచ్చేలా అభివృద్ధి చేయాలనుకున్నాం. 

కానీ అక్కడ చెట్టు ఉంది, పుట్ట ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది... అవి ఎలా బతుకుతాయి అంటూ ఆ 400 ఎకరాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అసలు మీ బాధ ఏంటి? చెరువులను కాపాడి, మూసీని ప్రక్షాళించి నాలాలు, రోడ్లపై ఆక్రమణల్ని తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్లు కాదా? ఆక్రమణలను తొలగిస్తుంటే రియల్‌ ఎస్టేట్‌ పడిపోతుంది అంటున్నారు. 

మరోవైపు రూ. వేల కోట్ల పెట్టుబడులతో ఐటీ, ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి ఒక ఇన్ఫర్మేషన్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ను తయారు చేద్దామంటే ప్రకృతి నాశనం అయిపోతోందంటున్నారు. అలాంటి వాళ్ల ఆలోచనల్లో ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లనీయద్దు, ప్రజలకు మేలు జరగనీయద్దనేది స్పష్టంగా కనిపిస్తోంది. కబ్జాల్లో ఉన్న చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? అనేది ప్రజలే ఆలోచించాలి’అని సీఎం రేవంత్‌ సూచించారు. 

మూసీని పునరుద్ధరించి తీరుతాం... 
ప్రతిపక్ష నేతలు మాత్రం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ జన్వాడ, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లలో విశాలమైన భవంతుల్లో బతుకుతున్నారని.. పేదలు మాత్రం మూసీలోనే, మురికిలోనే చావాలా? అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మూసీని పునరుద్ధరించి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తారని వివరించారు. నిర్వాసితులకు వేరే ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇస్తామని.. అవసరమైతే ప్రతి 5 కి.మీ. ప్రాంతాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకొని అపార్ట్‌మెంట్లు కట్టిస్తామన్నారు. 

మానవీయ కోణంలో వ్యవహరించాలి.. 
హైడ్రా మానవీయ కోణంలో వ్యవహరించాలని సీఎం రేవంత్‌ సూచించారు. పేదలపట్ల సానుభూతితో, పెద్దలపట్ల కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులను ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement