
హైదరాబాద్: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ అనేది పేద రైతుకు చుట్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఈ చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చెయ్యాలన్నారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా జూన్ 3వ తేదీ నుంచి 20 వరకూ మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులకు, కలెక్టర్లకు సీఎం రేవంత్ సూచించారు. ఈరోజు(మంగళవారం) అధికారులు, కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై సీఎం రేవంత్ మాట్లాడారు.
ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను నేను అభినందిస్తున్నా. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారింది. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు రూ. 12184 కోట్లు చెల్లించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.
చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి. కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా ఉండాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి.. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి. ఒక్క నిముషం వృధా చేయొద్దు.. నిర్లక్ష్యం వహించొద్దు. అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి.
ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉంది. సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టండి. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. జిల్లాలవారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియనించుకోండి’ అనిముఖ్యమంత్రి రేవంత్ సూచించారు.