స్కూళ్లు తెరుద్దామా?

CM KCR Will Conduct Meeting On Schools Reopen Issue - Sakshi

11న మంత్రులు, కలెక్టర్లతో భేటీలో నిర్ణయించనున్న సీఎం కేసీఆర్‌

రెవెన్యూ సమస్యలు, టీకాల పంపిణీకి కార్యాచరణ 

పట్టణ, పల్లె ప్రగతిపై సమీక్ష చేపట్టనున్న సీఎం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో తరగతులను ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలనే అం శంపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఓ నిర్ణయానికి రానుంది. ఏ తరగతి నుంచి క్లాసులు నిర్వహించాలి? ఏ విధంగా నిర్వ హించాలి? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి? తదితర అంశాలపై ఈ నెల 11న సీఎం కేసీఆర్‌ మం త్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో నిర్వహించనున్న సమావేశంలో నిర్ణయం తీసుకో నున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య, ఆరో గ్యం, విద్య, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల అంశాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

రెవెన్యూ సమస్యలపై కార్యాచరణ
సీఎం కేసీఆర్‌ గత నెల 31న సీనియర్‌ అధికారులు, కొందరు కలెక్టర్లతో సమా వేశమై రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ  చేశారు. 11న జరిగే  భేటీలో రెవెన్యూకు సంబంధించిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు. పెండింగ్‌ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్‌–బీలో చేర్చిన భూ వివాదాలకు పరిష్కారం తదితర విషయాలపై సమావేశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. 

వ్యాక్సిన్‌పై కార్యాచరణ..
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలతోపాటు టీకాను ప్రజలకు అందించేందుకు సిద్ధం చేయనున్న కార్యాచరణపై సీఎం ఈ భేటీలో చర్చిస్తారు. అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్‌ సరఫరా, ప్రాధాన్యతా క్రమంలో టీకాను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తారు.

పల్లె, పట్టణ ప్రగతిపై..
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ సమీక్షిస్తారు. గ్రామాలు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా వాటి వినియోగం ఎలా ఉంది తదితర అంశాలపై చర్చిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పరోగతిని సమీక్షిస్తారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలును సమీక్షిస్తారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని శనివారం నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా స్వల్ప అనారోగ్యం కారణంగా ఈ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేసినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top