సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సులు హడలెత్తిస్తున్నాయి. ప్రయాణికులను పరుగులు పెట్టిస్తున్నాయి. బస్సెక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. డ్రైవర్లు రోడ్డు మధ్యలోనే బస్సును ఆపేస్తారు. అప్పటి వరకు బస్టాపులో ఎదురు చూస్తున్న ప్రయాణికులు వేగంగా దూసుకెళ్లే వాహనాలను దాటుకొని వెళ్లి బస్సెక్కాల్సి వస్తోంది. ఈ హడావుడిలో వేగంగా వచ్చే ఏ వాహనం ఢీ కొన్నా ప్రాణాలకే ప్రమాదం. మరోవైపు ఎంతో కష్టపడి రోడ్డు దాటుకొని బస్సెక్కేందుకు పరుగెత్తినా ప్రయాణికులు చేరేవరకు బస్సు ఆగుతుందనే నమ్మకం లేదు.
మరోవైపు బస్సు దిగిన వాళ్లు సైతం వాహనాల మధ్యలోంచి రోడ్డు దాటి ఫుట్పాత్పైకి చేరుకోవాల్సివస్తోంది. ఇలా ఎక్కే, దిగే ప్రయాణికుల పాలిట సిటీబస్సులు ప్రమాదకరంగా మారా యి. మరోవైపు స్టాపుల్లో మహిళలు ఉంటే కొందరు డ్రైవర్లు బస్సు ఆపడంలేదు. గ్రేటర్లో ఈ పరిస్థితి నిత్యకృత్యంగా మారింది. దిల్సుఖ్నగర్, మెహిదీపట్నం, గచి్చ»ౌలి, సికింద్రాబాద్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారిన బస్సుల నిర్వహణను ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో నమోదు చేసింది.
ప్రమాదకర ప్రయాణం..
నిత్యం రద్దీగా ఉండే దిల్సుఖ్నగర్లో స్టాపుల్లో బస్సులను ఆపకపోవడంతో ప్రయాణికులు నడిరోడ్డు వరకు పరుగెత్తాల్సి వస్తోంది. ఇలా రోడ్డు మధ్యలో ఆగే బస్సులను మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు బస్టాపుల్లో బస్సులు ఆగకపోవడంతో చిరువ్యాపారులు ఫుట్పాత్లను దాటుకొ ని రోడ్లపైకి వచ్చారు. బస్టాపులను ఆక్రమించారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళల కోసం ప్రభుత్వం ఉచిత ప్రయాణసదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఆర్టీసీ సిబ్బంది మాత్రం మహిళలు కనిపిస్తే బస్సు ఆపకుండానే వెళ్లిపోతున్నారు. మలక్పేట్ స్టాపులో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళను పట్టించుకోకుండా రోడ్డు మధ్యలో ఒక క్షణం పాటు ఆపి డ్రైవర్ బస్సును ముందుకు దూకించాడు. ఆమె మరో బస్సు కోసం పడిగాపులు కాసింది.
ఆటోలకు అడ్డాలుగా..
అమీర్పేట్, సికింద్రాబాద్, మలక్పేట్, మెహిదీపట్నం, ఉప్పల్ తదితర అనేక ప్రాంతాల్లో బస్టాపులు, బస్షెల్టర్లు ఆటోలు, ప్రైవేట్ వాహనాలకు అడ్డాలుగా మారాయి. దీంతో డ్రైవర్లు బస్సులను రోడ్డు మధ్యలోనే ఆపేస్తున్నారు.
మూణ్నాళ్ల ముచ్చటగానే..
గతంలో నాచారంలో ఓ మహిళ బస్సు దిగి రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై చనిపోయారు. ఆ సందర్భంగానే రోడ్డు మధ్యలో నిలిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అప్పటి ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రకటించారు. కొంతకాలం బస్సులు స్టాపుల్లోనే ఆగాయి. ప్రయాణికులు ఎక్కే వరకు, దిగేవరకు వేచి ఉండటంతో ఎంతో ఊరట లభించింది. కానీ ఆ క్రమశిక్షణ మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. ర్యాష్ డ్రైవింగ్, లెఫ్ట్ డ్రైవింగ్, బస్టాప్ జంపింగ్ యథావిధిగా కొనసాగుతున్నాయి.


