జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులను మంత్రి కొండా సురేఖకు కాకుండా సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ విచ్ఛన్నం కావడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి అని చెప్పారు.
‘‘సుష్మితను ప్రేరేపించిందెవరు? సుష్మిత కామెంట్స్ కు ఎవరు బాధ్యులు? కావాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పండి. సమయం, సందర్భం లేకుండా.. ప్రకాశ్ రెడ్డికి ఓటు వేయాలని రేవంత్ ఎలా చెబుతారు? రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటి నుంచే అభ్యర్థులను అనౌన్స్ చేసుకోవాలని ఏమన్నా రాసిచ్చారా?
రాహూల్ ఆలోచనలకు భిన్నంగా పార్టీ ఫిరాయింపులను తెరపైకి తీసుకురావడం వల్లే కదా ఇవాళ పార్టీ విచ్ఛిన్నం కావడానికి కారణం. కాంగ్రెస్ డిసిప్లైనరీ కమిటీ ఏఐసీసీ కనుసన్నల్లో నడవడం లేదు.. రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో నడుస్తోంది. నిన్న ఆదిలాబాద్ బీఏసీ సమావేశంలో ఆ అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి.
చిన్నారెడ్డిని, సుష్మితను ప్రేరేపించింది రేవంత్ రెడ్డే.. పార్టీ ఫిరాయింపులతో విచ్ఛిన్నానికి కారకుడూ రేవంత్ రెడ్డే. ఇంకా రెండేళ్లు కాంగ్రెస్ ను బతికించుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పునరాలోచన చేయాలి. చంద్రబాబు మేనిఫెస్టోను అమలు చేసేందుకు, కాంగ్రెస్ ను కనుమరుగు చేసేందుకే రేవంత్ రెడ్డి పార్టీలోకి ఎంటరయ్యారు. 2034 దాకా తానే ముఖ్యమంత్రినని రేవంత్ ఎలా చెబుతాడు.. కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకొస్తుందని చెప్పాలి’’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.


