వానలు తగ్గేదాకా..పరీక్షలన్నీ వాయిదా!  | All the exams are postponed until the rains subside | Sakshi
Sakshi News home page

వానలు తగ్గేదాకా..పరీక్షలన్నీ వాయిదా! 

Jul 27 2023 2:25 AM | Updated on Jul 27 2023 2:25 AM

All the exams are postponed until the rains subside - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, విద్యా సంస్థలకు వరుసగా సెలవులు ప్రకటించడం పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపుతోంది. వర్షాలు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అన్నిరకాల పరీక్షలను వాయిదా వేయాలని ఉన్నతాధికారులు యూని వర్సిటీలు, విద్యా సంస్థలకు సూచించారు. దీంతో ఇప్పటికే డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఇంటర్నల్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి.

డిగ్రీ ప్రవేశాల తేదీల్లోనూ మార్పులు చేశారు. ఇంజనీరింగ్‌ సీట్లలో తొలివిడత చేరికలకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తేదీలను పొడిగించారు. మలి విడత ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి ఈ నెల 27తో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుండటంతో.. ఈ గడువునూ మరికొంత పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.

బడుల్లో అంతర్గత పరీక్షలకు తిప్పలు
పాఠశాలల్లోని విద్యార్థులకు జూలైలో జరగాల్సి ఉన్న ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ–1) పరీక్షలను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు. వర్షాల మూలంగా వారం రోజులుగా సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇటీవలి వరకు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఇప్పుడీ వర్షా లతో మళ్లీ అంతరాయం రావడంతో నిర్ణీత సిలబస్‌ పూర్తవలేదని.. ఎఫ్‌ఏ–1 పరీక్షలను వాయిదా వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఇంటర్‌ ప్రవేశాల తేదీ పొడిగింపు
భారీ వర్షాలతో వరుస సెలవులు, ఇంటర్నెట్, ఇతర ఇబ్బందుల నేపథ్యంలో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును ఈ నెల 25 నుంచి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఇంటర్‌ బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది. ఇంకా లక్ష మందికిపైగా ఇంటర్‌లో చేరాల్సి ఉందని.. వానలు ఇలాగే కొనసాగితే గడువు పొడి గించాలని బోర్డ్‌ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.

వర్సిటీల్లో పరీక్షలు వాయిదా.. దోస్త్‌ గడువు పెంపు
ఉస్మానియా, జేఎన్టీయూహెచ్‌ సహా పలు యూని వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో అంతర్గత పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఈ నెలాఖరులో నిర్వ హించాలని భావించినా.. వానలు తగ్గే అవకాశం లేకపోవడంతో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు ఆలస్యం కాను న్నాయి.

డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్‌ కౌన్సెలింగ్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తేదీని ఈ నెల 28 వరకూ పొడిగించారు. ఇక ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆప్షన్ల గడువు 27తో ముగియనుంది. ఈ నెల 31న సీట్ల కేటాయింపు ఉంటుందని సాంకేతిక విద్య కమిషనరేట్‌ తెలిపింది. వర్షాలు తగ్గకపోతే రెండో విడత చేరికల తేదీని పొడిగించే వీలుందని అధికారులు అంటున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement