సిలిండర్ చోరీ చేసిన వ్యక్తి అరెస్టు
తిరువళ్లూరు: తిరుప్పాచ్చూర్ గ్రామంలో ఇంట్లోకి చొరబడి గ్యాస్ సిలిండర్ చోరీకి యత్నించిన వ్యక్తిని పట్టుకుని స్థానికులు దేహశుద్ది చేశారు. అనంతరం తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అతడ్ని పట్టుకుని స్టేషన్కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితుడు నకిలీ విద్యుత్శాఖ ఉద్యోగిగా నిర్ధారించారు. ఇతను తిరువేళాంగాడు యూనియన్ పెద్దకలకాటూరు గ్రామానికి చెందిన విజయకుమార్(32) గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు సుమారు వంద సిలిండర్లను వేర్వేరు ప్రాంతాల్లో చోరీ చేసి అధిక ధరలకు విక్రయించినట్టు నిర్ధారించారు. అనతంరం నిందితుడ్ని కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టి రిమాండ్కు తరలించారు.
పోలీసుల అదుపులో రౌడీ షీటర్
తిరువొత్తియూరు: చైన్నె, పుళల్ కావాంగరై ప్రాంతానికి చెందిన విజి (34) పేరుమోసిన నేరస్థుడు. ఇతనిపై 2 హత్య కేసులు, 2 హత్యాయత్నం కేసులు, 16 ఇతర కేసులు కలిపి మొత్తం 20 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇతను ప్రముఖ రౌడీలైన కాతుకుత్తు రవి, నెరకున్రం సూర్యకు విజి అత్యంత సన్నిహితుడు. గతంలో రెండు హత్య కేసులు, రెండు గంజాయి అక్రమ రవాణా కేసులు ఒక గొడవకు సంబంధించిన కేసులో పోలీసులు ఇతనిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విజి బెయిల్పై జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన తర్వాత, విజి కోర్టు విచారణకు హాజరుకాకుండా పరారయ్యాడు. దీనివల్ల కోర్టు ఇతనికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇతనిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పాండిచ్చేరి, సేలం, కొడైకెనాల్, కొల్లిమలై , బెంగళూరు వంటి అనేక ప్రాంతాల్లో గాలించారు. విజి పోలీసులకు చిక్కకుండా తన నివాసాన్ని తరచుగా మారుస్తూ తప్పించుకు తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో విజి పుదుచ్చేరిలోని ఆరోవిల్ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీని ఆధారంగా ప్రత్యేక నేర నిరోధక విభాగం పోలీసులు అక్కడికి చేరుకుని, తుపాకీతో అతన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు.అనంతరం అతడిని పుళల్ పోలీసులకు అప్పగించారు. ఇనన్స్పెక్టర్ వసంతరాజా కేసు నమోదు చేసి, విజిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత జైలుకు తరలించారు.
విద్యార్థినికి లైంగిక వేధింపులు
సింగపెన్ టీమ్కు చిక్కిన యువకుడు
వేలూరు: పాఠశాల విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన యువకుడిని సింగపెన్ పోలీసులు పట్టుకొని విచారణ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెప్ విజయ్ గత కొద్ది రోజుల క్రితం నూతన దుస్తులతో కూడిన సింగపెన్ పోలీసులు విభాగాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పోలీసులు ముఖ్యమైన రోడ్డులు, బాలికలు చదివే కళాశాలలు, పాఠశాలలు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లోని బాలికల వద్ద హద్దు మీరి చేష్టలు చేసే వారిని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. వేలూరు బాగాయం ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలిక వద్ద రోజూ ఉదయం, సాయంత్రం వేలల్లో అదే ప్రాంతానికి చెందిన వివాహం జరిగిన ఒక యువకుడు తరచూ ప్రేమ వేధింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిపై విషయం తెలుసుకున్న సింగపెన్ పోలీసులు అక్కడ ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆ పాఠశాల విద్యార్థినికి పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఒక యువకుడు ఆ విద్యార్థిని వెంటబడి ప్రేమ టార్చర్ చేస్తున్నట్లు గుర్తించిన సింగ పెన్పోలీసులు వెంటబడి ఆ యువకుడిని అరెస్ట్ చేసి వేలూరు మహిళా స్టేషన్కు తీసుకొచ్చి అతని వద్ద విచారణ చేస్తున్నారు. వేలూరు జిల్లాలోనే సింగ పెన్ పోలీసులు మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని లైంగిక వేధింపులు చేస్తున్న యువకుడిని పట్టుకున్న ఘటన సంచలనం రేపింది.
సహకార సంఘంలో..
కొరుక్కుపేట: తిరువల్లిక్కేని నగర సహకార సంఘంలో డీయూసీ (దత్తా) షేర్ల కొనుగోలులో భారీగా అవినీతి జరిగిందని, సంబంధిత అధికారులపై సహకార సంఘాల రిజిస్ట్రార్ చర్య తీసుకోవాలని ద్రవిడ మున్నేట్ర కజగం ప్రధాన కార్యదర్శి రాజన్ స్వామి నాథన్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న కె. ఎం. దేవిప్రియ, గత మార్చిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి వివిధ అవకతవకలకు పాల్పడుతున్నారు. మే నెలలో జరిగిన జేపీసీ సమావేశంలో, బహిరంగ మార్కెట్లో హోల్సేల్ ధర రూ. 85కు లభించే బర్మా దురమ్ దాల్ను ఆమె ఒక వ్యాపారి ద్వారా అదనపు ధరకు కొనుగోలు చేశారు. దీని ద్వారా ఆమె రూ. 3,24,000 వ్యక్తిగత లాభం పొందారు. ఈ అక్రమ కొనుగోళ్ల మొత్తం విలువ రూ. 20 నుంచి 25 లక్షల మధ్య ఉంది. అంతేకాకుండా, జూన్లో పప్పుధాన్యాల ధర కిలోకు రూ. 13 తగ్గినప్పటికీ, మే నెల ధర అయిన రూ. 127కు కొనుగోలు చేయడం వల్ల కంపెనీకి రూ. 1,36,000 ఆర్థిక నష్టం వాటిల్లింది. ఆమె నిబంధనలను ఉల్లంఘించి కొంతమందికి పదోన్నతులు కూడా ఇచ్చారు. ఈ విషయంలో సహాయపడే పరిపాలనా అధికారిణి వద్ద 300కు పైగా ఫైళ్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఆమె కార్యాలయ వాహనాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతూ, కంపెనీకి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నారు. అందువల్ల, రిజిస్ట్రార్ సరైన విచారణ జరిపి, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న అధికారులపై తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.


