కొరుక్కుపేట: పురపాలక పరిపాలన , తాగునీటి సరఫరా శాఖ సంయుక్త ప్రధాన కార్యదర్శి గగన్దీప్ సింగ్ బేడీ తిరువీకా నగర్ జోన్ పరిధిలోని పులియంతోపు ప్రాంతంలోని వీధి కుక్కల నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి, దాని కార్యకలాపాలను శనివారం తనిఖీ చేశారు. ఆయన ఈ కేంద్రంలో కుక్కలకు చేసే సంతాన నిరోధక ప్రక్రియలను , పెంపుడు జంతువులకు అందించే చికిత్సను పరిశీలించారు. నగరంలో రోజుకు సగటున 350 నుండి 400 వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు ప్రకటించారు.
నేడు యథాతథంగా
ఎలక్ట్రిక్ రైల్ సర్వీసులు
కొరుక్కుపేట: నీట్ పునఃపరీక్ష ఆదివారం జరగనుంది. ఎలాంటి గందరగోళం లేకుండా పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రశ్నపత్రాలను భద్రంగా తీసుకువచ్చి రహస్య ప్రదేశంలో ఉంచారు. పరీక్షా విధానానికి సంబంధించిన ప్రతి అంశం అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది.ఈ పరిస్థితిలో, నీట్ పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం ఎలక్ట్రిక్ రైలు సర్వీసును పెంచారు. అభ్యర్థులు కేవలం చైన్నె నుంచే కాకుండా తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుండటంతో, సాధారణ వారపు రోజుల షెడ్యూల్ ప్రకారమే ఆదివారం కూడా ఎలక్ట్రిక్ రైళ్లు నడుస్తాయని చైన్నె రైల్వే గేట్ డివిజన్ ప్రకటించింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రత్యేక అవసరాల సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అరక్కోణం రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఇంజనీరింగ్ పనుల కారణంగా, చైన్నె బీచ్–అరక్కోణం–తిరుత్తని మార్గంలో మాత్రమే ఎకానమీ రైళ్లు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం నడుస్తాయి.అదేవిధంగా, చైన్నె బీచ్–తాంబరం మార్గంలో నడిచే ఏసీ ఎలక్ట్రిక్ రైళ్లు కూడా ఆదివారం నాడు షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయి. పరీక్షలు రాయడానికి వెళ్లే విద్యార్థులకు, వారితో పాటు వచ్చే తల్లిదండ్రులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు సెంట్రల్, ఎగ్మోర్, తాంబరం, పెరంబూర్, చెంగల్పట్టు, కాంచీపురం, అవడి, తిరువళ్లూరు, కాట్పాడి సహా 9 ప్రధాన రైల్వే స్టేషన్లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆలయాల్లో 46 ప్రాజెక్టుల రద్దు
– ఉత్తర్వుల జారీ
సాక్షి, చైన్నె : కోర్టు తీర్పు, చట్టపరమైన సమస్యల నేపథ్యంలో ఆలయాల్లో అమలుకు నిర్ణయించిన 46 ప్రాజెక్టులను రద్దు చేస్తూ టీవీకే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు ఉత్తరువులు జారీ చేశారు. ఆలయ నిధులను షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాల వంటి వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించడం చట్టవిరుద్దమని ఇటీవల కోర్టు ఆదేశాలకు కట్టుబడి గత డీఎంకే ప్రభుత్వంలో మంజూరు చేసిన ప్రాజెక్టులకు చెక్ పెట్టే దిశగా టీవీకే ప్రభుత్వం దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. ఆర్థిక భారం , నిధుల దుర్వినియోగం కాకుండా చూడటం లక్ష్యంగా, కోర్టు ఉత్తర్వుల కారణంగా తలెత్తిన పరిస్థితులు, దేవాలయాలపై పడే ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ప్రకటించిన రూ. 246 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులను (వివాహ మందిరాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు) రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆలయ నిధులను కేవలం పవిత్రమైన పనులకు, భక్తులకు , దేవాలయాలకు మేలు చేసేలా మాత్రమే వినియోగిస్తామని ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ఇందుకు అనుగుణంగానే పాత వాణిజ్య ప్రాజెక్టులను రద్దు చేసి, భక్తుల కోసం త్వరలోనే కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తామని ప్రజలకు, కోర్టుకు స్పష్టం చేయడానికి దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
రేషన్ కార్డుదారుల వేలిముద్రల నమోదు తప్పనిసరి
కొరుక్కుపేట: రేషన్ కార్డులలో మరణించిన వ్యక్తుల పేర్లను చేర్చారన్న ఫిర్యాదుల నేపథ్యంలో, రేషన్ కార్డులపై ఉన్న ప్రతి కుటుంబ సభ్యుని వేలిముద్రలను ధ్రువీకరించాలని సహకార శాఖ ఆదేశించింది. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో రేషన్ కార్డులకు ఆధార్ నంబర్లను అనుసంధానించలేదు. అంతేకాకుండా, వేలిముద్రల విషయంలో వారిని భయపెడుతూనే ఉన్నారు. దీనిని నివారించడానికి, ఆధార్ నంబర్ను అనుసంధానం చేసుకోవాలని, వేలిముద్రలను నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే తమిళ, ఆంగ్లరేషన్ కార్డులలో పేరు మార్పు కారణంగా మతుల పేర్లు తొలగించలేదు. ఈనేపథ్యంలో నిర్ణీత సమయంలోపు వేలిముద్రలు నమోదు చేసుకోవడం అవసరం. రేషన్ వస్తువుల పంపిణీలో అవకతవకలను నివారించడానికి కావే ఇండియా బయోమెట్రిక్స్ రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వేలిముద్రల నమోదు తప్పనిసరి అని అధికారులు తాజాగా వెల్లడించారు. జిల్లా పంపిణీ కార్యాలయాన్ని సంప్రదించి, రేషన్ కార్డుల నుండి వారి పేర్లను సరిచూసుకోవాలని పేర్కొంది.


