– సీమాన్
సాక్షి, చైన్నె: చైన్నెలోని నీలాంగరైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటు వేయకపోవడం అనేది ప్రజాస్వామ్యానికి చేసే ద్రోహం అని సీమాన్ అభివర్ణించారు. బాంబులు పెట్టడం, హత్యలు చేయడం, అక్రమంగా ఆస్తులు కూడబెట్టడం మాత్రమే నేరాలు కాదని, ఓటు వేయకపోవడం కూడా అంతే పెద్ద నేరమని ఆయన పేర్కొన్నారు. ఒక్క ఓటుతో ఏం మారుతుందని అనుకోవద్దని, ప్రతి ఒక్క ఓటు నుండే వ్యవస్థలో మార్పు మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. చదువుకున్న వారే ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలని, ఓటు వేయకపోవడం అనేది కేవలం నిర్లక్ష్యం కాదని, అది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేకపోవడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేయని వారికి అసలు సమస్య ఏంటి? అభ్యర్థులపై నమ్మకం లేదా? లేక ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపైనే నమ్మకం లేదా? అని ఆయన ప్రశ్నించారు. 100 శాతం పోలింగ్ జరగాలని ఎన్నికల కమిషన్ చెబుతోందని, దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.


