పళ్ళిపట్టు: పొదటూరుపేట ప్రభుత్వ బస్సు డిపోకు ఎట్టకేలకు మహర్దశ ఏర్పడింది. ప్రయాణికుల చాలాకాలం ఎదురుచూపు నెరవేర్చే విధంగా డిపోకు డీజిల్ ట్యాంకుతో పాటూ ప్రహరిగోడ నిర్మించి ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. వివరాలు.. పళ్లిపట్టు పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సేవలు మెరుగుపరిచే విధంగా గత 2010లో పొదటూరుపేటలో ప్రభుత్వ బస్సు డిపో ప్రారంభించారు. అయితే ఆ డిపోలో కనీస సౌకర్యాలు కల్పించక పోవడంతో డిజిల్, కలెక్సన్, బస్సులు మెయింటినన్స్ కోసం తిరుత్తణి డిపోకు వెళాల్సి వుండేది. దీంతో పొదటూరుపేట బస్సు డిపో కార్మికులు ఇబ్బందులు పడేవారు. ప్రయాణికులకు సైతం మెరుగైన సేవలు అందేవి కావు. డిజీల్ ట్యాంకు ఏర్పాటు చేయాలని, ఇంజినీరింగ్ వర్స్షాప్ ఏర్పాటు చేయాలన్న ప్రయాణికుల డిమాండ్ మూరు ఎమ్మెల్యే చంద్రన్ నియోజకవర్గ నిధుల నుంచి రూ. 15 లక్షల వ్యయంతో ప్రహరిగోడ, డీజిల్ ట్యాంకు ఏర్పాటు చేశారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని డీజిల్ ట్యాంకు సేవలు ప్రారంభించి, ప్రహరి గోడను తిలకించారు. కార్యక్రమంలో మండల డీఎంకే కార్యదర్శి రవీంద్ర, డిపో మేనేజర్ జ్ఞానశేఖర్ సహా అనేక మంది పాల్గొన్నారు.


