సాక్షి, చైన్నె : శ్రీ రామచంద్ర విద్యా సంస్థలో శనివారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంజరిగింది. ‘హక్కులు, న్యాయం , కార్యాచరణ’ అనే అంశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ప్రభా శ్రీదేవన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీ రామచంద్ర ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ట్రస్ట్ ట్రస్టీ సంయుక్త వెంకటాచలం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
సమానత్వం ఇంట్లోనే మొదలవ్వాలి..
జస్టిస్ ప్రభా శ్రీదేవన్ మాట్లాడుతూ.. సమానత్వం , న్యాయం అనేవి ముందుగా ఇంటి నుండే ప్రారంభం కావాలని పిలుపు నిచ్చారు. అప్పుడే సీ్త్ర, పురుషులను సమానంగా గౌరవించే భావి తరాలను నిర్మించగలమని ఆమె పేర్కొన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు సమానత్వం ప్రాముఖ్యతను నేర్పించాలని ఆమె సూచించారు. విద్యార్థులు తమ స్నేహితులను లింగభేదం లేకుండా సమానంగా చూడాలని, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో నిజాయితీని పాటించాలని కోరారు. వైస్ చాన్స్లర్ డాక్టర్ ఉమా శేఖర్ మాట్లాడుతూ.. శ్రీ రామచంద్ర సంస్థ మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన, వివక్ష లేని వాతావరణాన్ని కల్పిస్తోందని తెలిపారు. మహిళలపై వివక్ష, వేధింపులను అరికట్టేందుకు సంస్థలో ’ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ’, ’జెండర్ సెన్సిటైజేషన్ సెల్, గ్రీవెనన్స్ రిడ్రెసల్ సెల్ వంటి విభాగాలు నిరంతరం పనిచేస్తున్నాయని వివరించారు.


