సాక్షి, చైన్నె: వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైన్నె క్యాంపస్లోని మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చాన్స్లర్ డాక్టర్ ఎ.ఎస్. గణేషన్, డాక్టర్ అనురాధ గణేషన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలను ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఏవీఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ జె. జానెట్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో భావి తరాలను తీర్చిదిద్దడంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని ఆమె కొనియాడారు. చాన్స్లర్ డాక్టర్ ఎ.ఎస్. గణేషన్ మాట్లాడుతూ, అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధించినప్పుడే దేశం పురోగమిస్తుందని పేర్కొన్నారు. ఆ విద్యాసంస్థ కార్యనిర్వాహక మండలి సభ్యుడు సురేష్ శామ్యూల్ , ఎస్.ఏ.ఎస్ డైరెక్టర్ డాక్టర్ క్రిస్టియానా సింగ్ లింగ సమానత్వం గురించి వివరించారు.
పురస్కారాలు..
ఈ వేడుకల్లో 2026 ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులు నిలిచాయి. ప్రముఖ భారతీయ చలనచిత్ర దర్శకురాలు. భారతీయ సినిమాలో తనదైన కథా శైలితో ప్రభావితం చేసినందుకు సుధాకొంగరను అవార్డుతో సత్కరించారు. అలాగే తమిళనాడు నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ. పర్వతారోహణలో ముత్తమిళ్ సెల్వి నారాయణన్ సాధించిన అద్భుత విజయానికి గుర్తింపుగా పురస్కారం అందజేశారు. వీరితో పాటూ విద్యా, వృత్తిపరమైన రంగాలలో ప్రతిభ చూపిన వారికి ’ఉమెన్ లీడర్షిప్ అవార్డులు, ఫ్యాకల్టీ–స్టూడెంట్ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ గిరి రంగసామి, ఏవీఐటీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.పి. సంగీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ సంచికను ఆవిష్కరించారు.


