
టీఎన్పీఎస్సీ ద్వారా విద్యుత్ శాఖలో పోస్టుల భర్తీ
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ శాఖలో ఖాలీ పోస్టులను టీఎన్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాధాక్రిష్ణన్ అన్నారు. వేలూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన పెట్ల్యాండ్ ఆస్పత్రిని ఈనెల 25వ తేదీన సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు. దీంతో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన ఆయన ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన పెట్ల్యాండ్ ఆస్పత్రి ప్రారంభం కానుందన్నారు. ఇక్కడ ఎంత విద్యుత్ అవసరం, ఆస్పత్రిలో విద్యుత్ సదుపాయాలు తదితర వాటిపై ప్రస్తుతం తనిఖీ చేశామన్నారు. వేలూరు రీజియన్ పరిధిలో సుమారు 1,557 మెగావాట్ విద్యుత్ అవసరం ఉందన్నారు. 110 కిలోవాట్లతో కూడిన మూడు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా ప్రస్తుతం అన్ని ప్రాంతాలకు విద్యుత్ను సరఫరా చేస్తున్నామన్నారు. అనంతరం ఆస్పత్రిలోని నిర్మాణ పనులు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, విద్యుత్ సరఫరా తదితర వాటిని తనిఖీ చేశారు.