జంబూ మహర్షి చిత్రంలో బాలాజీ
తమిళ సినిమా: మరో బయోపిక్గా జంబూ మహర్షి చిత్రం వెండి తెరపైకి రానుంది. తిరుచ్చి సమీపంలోని తిరువానైకావల్ వద్ద జీవ సమాధి అయిన జంబూ మహర్షి ఇతివృతంతో ఇది తెరకెక్కనుంది. టీవీఎస్ ఫిలింస్ పతాకంపై ఎన్.బాలాజీ, పి.ధనలక్ష్మి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. వివరాలు.. పి.బాలాజీ కథానాయకుడిగా పరిచయం అవుతూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం జంబూ మహర్షి. మస్కరా చిత్రం ఫేమ్ అస్మిత నాయకిగా నటించిన ఇందులో నటుడు రాధా రవి, వాగై చంద్రశేఖర్, ఢిల్లీ గణేష్, నంబిరాజ్, మీరా కృష్ణన్, బాహుబలి ప్రభాకర్, వైయాపురి, కరాటే రాజా తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. దేవా సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలను కూడా దర్శకుడు పి.బాలాజీనే అందించడం విశేషం. అదే విధంగా దీనికి బాలాజీ, భువనేశ్వర్, జార్జ్ పాటలను రాశారు. జంబూ మహర్షి యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం తన తొలి ప్రయత్నం అనీ, ఇందులో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని, చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు పి.బాలాజీ పేర్కొన్నారు. చిత్రాన్ని ఈ నెల 24న తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


