
టార్గెట్ రూ.6
కోట్లు
సూర్యాపేట మున్సిపాలిటీలో ఈ నెల ఆస్తిపన్ను వసూలు లక్ష్యం ఇదీ
జూన్ దాటితే ..
మున్సిపాలిటీలో ప్రతి ఆరు నెలలకు సంబంధించిన ఆస్తి పన్నును మొదటి మూడు నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల ఆస్తి పన్నును జూన్ నెలాఖరులోగా చెల్లించకుంటే ఆస్తి పన్నుపై ఫైన్ పడుతుంది. అదే విధంగా అక్టోబర్ నుంచి మరుసటి ఏడాది మార్చికి సంబంధించిన ఆరు నెలల ఆస్తి పన్నును డిసెంబర్ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా ఆస్తి పన్ను చెల్లించని వారికి అపరాధరుసుంతో సహాచెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి గడువు ప్రకారం చెల్లించకపోతే ఆటోమెటిక్గా కంప్యూటర్లో అపరాధ రుసుంతో జనరేట్ అవుతుంది. అపరాధ రుసుముకు సంబంధించి తగ్గింపు లాంటివి ఇక్కడి స్థానిక మున్సిపల్ అధికారుల పరిధిలో ఉండదు. దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తుంది. భవన యజమానులందరు అపరాధ రుసుం పడకుండా ఉండాలంటే ఏప్రిల్ నెలలో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.
సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీలో వచ్చే ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నులో భాగంగా ఈనెలలో రూ.6కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి ముందస్తుగా చెల్లించిన వారికి 5శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈ రాయితీ నివాస, వాణిజ్య భవనాలకు వర్తించనుంది. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.90లక్షలు వసూలు చేశారు. ఈనెల 30తో రాయితీ గడువు ముగియనుంది.
ఆస్తి పన్ను రాబట్టుకోవడానికి..
ఆస్తి పన్ను రాబట్టుకోవడానికి మున్సిపల్శాఖ రాయితీ అవకాశం కల్పించింది. ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం ఒకే సారి చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈమేరకు ఆశాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. రాయితీ ప్రకటనతో ఎక్కువ మంది ముందస్తుగా తమ ఆస్తి పన్ను చెల్లించడానికి మొగ్గు చూపుతున్నారు. దీనిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి తద్వారా ఏప్రిల్ మాసంలోనే ఎక్కువ శాతం ఆస్తి పన్ను వసూలు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు
బకాయిలతో సహా చెల్లిస్తేనే..
మున్సిపల్ పట్టణంలోని భవనాలు, బహుళ వాణిజ్య భవనాలకు గతంలో ఎలాంటి ఆస్తి పన్ను బకాయిలు లేని వారు మాత్రమే ఐదు శాతం రాయితీకి అర్హులు అవుతారు. 2025 మార్చి 31లోపు రూపాయి కూడా ఆస్తి పన్ను బకాయి ఉండకూడదు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆస్తి పన్ను ను ఈనెల 30వ తేదీలోగా పూర్తిగా చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ఇస్తారు. బకాయి ఉన్న వారు బకాయితో సహా చెల్లిస్తే ఈ ఏడాదికి సంబంధించిన పన్నులో 5 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఉదాహరణకు ఏడాదికి లక్ష రూపాయల ఆస్తి పన్ను చెల్లించే వారికి ముందస్తుగా చెల్లించడం ద్వారా రూ. 5వేల ను భవనాల యజమానులు లబ్ధిపొందనున్నారు. ఆస్తి పన్ను ఆలస్యంగా చెల్లించినా అపరాధ రుసుం చెల్లించాలి. అందువల్ల ప్రజలు ఈ5 శాతం రాయితీని వినియోగించుకుంటే బాగుంటుంది.
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
ఇంటి యజమానులు ఈ సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ఒకేసారి చెల్లించి 5శాతం రాయితీ పొందాలి. బకాయిలతో సహా ఈ ఏడాది పన్ను చెల్లిస్తే కూడా రాయితీ వర్తించనుంది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జూన్ తర్వాత పెనాల్టీ పడుతుంది.
– బి.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట
ఇప్పటి వరకు రూ.90లక్షలు వసూలు
సూర్యాపేట మున్సిపాలిటీలో 35,429 నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను డిమాండ్ రూ.15కోట్లు ఉంది. ఎర్లీబర్డ్ స్కీం కింద ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈనేపథ్యంలో ఈనెలలో రూ.6 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 20 మంది మున్సిపల్ సిబ్బంది, ఆర్ఓ కలిసి మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.90లక్షలు వసూలు చేశారు.
ఫ ఎర్లీబర్డ్ స్కీం కింద 5శాతం రాయితీ
ఫ ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి వర్తింపు
ఫ ఇప్పటి వరకు రూ.90లక్షలు వసూలు
సూర్యాపేట మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వివరాలు(రూ. కోట్లలో)
సంవత్సరం మొత్తం ఏప్రిల్ వసూలు
డిమాండ్ టార్గెట్
2024–25 13.60 5 4.98
2025–26 15 6 0.90