మండలంలో రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు. సారవకోట పీఏసీఎస్ చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నా డీఏపీ దొరకడం లేదని ఆరోపిస్తున్నారు. రైతుల వివరాలు యాప్లో నమోదు చేస్తే ఏ రైతుకు ఎంత ఎరువు ఇవ్వాలని వస్తుంది. యాభై సెంట్లు కంటే ఎక్కువగా ఉన్న రైతులకు మాత్రమే డీఏపీ ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో 50 సెంట్లు ఉన్న రైతులు డీఏపీ కోసం ప్రైవేట్ వర్తకులను ఆశ్రయించాల్సి వస్తోంది. ముఖ్యంగా కౌలు రైతులు ఓటీపీల వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీనిపై పీఏసీఎస్ ఇన్చార్జి సీఈఓ అశ్వినిని వివరణ కోరగా యాప్లో నమోదు చేయడానికి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, దీంతో రైతులకు డీఏపీ అందించేందుకు ఆలస్యం అవుతుందన్నారు. మండలంలో డీఏపీ బస్తా రూ.1350కు అమ్మాల్సి ఉండగా ప్రైవేటు డీలర్లు రూ.1400 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. – సారవకోట
3 రోజులుగా వస్తున్నా
డీఏపీ కోసం ఆధార్ కార్డు జిరాక్స్ మూడు రోజుల కిందట సారవకోట పీఏసీఎస్లో అందించాను. మూడు రోజుల నుంచి రోజు వస్తున్నా ఒక్క బస్తా డీఏపీ దొరకలేదు. – కర్ణం అప్పారావు, రైతు,
మొదలికొత్తూరు గ్రామం, సారవకోట మండలం


