న్యూస్రీల్
శ్రీకాకుళం
● పెరుగుతున్న గ్యాస్ ఇబ్బందులు
● ఇప్పటికే మూత పడుతున్న హొటళ్లు, రెస్టారెంట్లు
● గృహ వినియోగదారులకూ తప్పని ఇబ్బంది
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
శ్రీకాకుళం పాతబస్టాండ్, హిరమండలం:
పశ్చిమాసియా యుద్ధం వంటింటిలో మంట రేపుతోంది. జిల్లాలో నానాటికీ గ్యాస్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. అధికారు లు ఇబ్బంది లేదని చెబుతున్నా చిరు వ్యాపారులు, గృహ వినియోగదారులు తీవ్రంగానే ఇక్కట్లకు గురవుతున్నారు. ఆంక్షలకు లోబడే గ్యాస్ను సరఫరా చేయాలని ఆయా కంపెనీలకు, అధికారులకు ఉత్తర్వులు చేరాయి. వివిధ కంపెనీల ఏజెన్సీల బుకింగ్యాప్లు కూడా పనిచేయడం లేదు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
పరిమితులు
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొన్ని పరిమితులు విధించింది. దానికి లోబడి ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు సిలిండర్ విడిపించుకునేందుకు సమయం ఇచ్చా రు. గడువులోగా బుకింగ్కి అవకాశం లేదు, ఒక వేళ బుకింగ్ చేసుకున్నా ఆ గడువు తీరేంత వరకు సిలిండర్ రాదు. ఇక డబుల్ సిలిండర్లు ఉన్నవారికి 32 రోజులకు సిలిండర్ పొందేలా చర్యలు తీసుకున్నా రు. దీనివల్ల పెద్ద కుటుంబాలకు, ఎక్కువ గ్యాస్ వినియోగించే వారికి గ్యాస్ సిలిండర్ సమస్యలు వస్తున్నాయి.
యాప్ ఇబ్బందులు
గృహావసరాలకు గ్యాస్ను బుకింగ్ చేసేందుకు ప్రస్తుతం సెల్ ద్వారా ఉన్న యాప్, మిస్కాల్, నేరుగా ఫోన్ చేసి వారు చెప్పిన విదంగా అంకెలను నొక్కి బుకింగ్ చేసుకునే విధానం ఉంది. అయితే గత నాలుగు రోజులుగా ఈ బుకింగ్ సజావుగా సాగడం లేదు. రోజులో ఏదో సమయంలో ఒక సారి బుకింగ్ చేయడం అవుతోంది. మిగిలిన సమయాల్లో బుకింగ్ యాప్ తీసుకోవడం లేదు. దీంతో వినియోగదారులు గ్యాస్ సమస్యలు పెరిగాయని ఆందోళన చెందుతున్నారు. నగరంలో ఒక గ్యాస్ ఏజెన్సీలో ఒకే రోజున వారం రోజుల్లో జరిగే బుకింగ్ అంటే సుమారుగా 5000 వరకు బుకింగ్ అయ్యా యి. వాస్తవానికి ఆ ఏజెన్సీలో వారం రోజుల పాటు 5000 సిలిండర్ల్ బుకింగ్ అవుతాయి.
వారం వరకు రాదు..
ఒక్క సారిగా అధిక సంఖ్యలో గ్యాస్ బుకింగ్ చేయ డం వల్ల ఏజెన్సీలకు భారమవుతోంది. ట్రాన్స్పోర్టు, నిబంధనలు, కొరత వంటి కారణాలన్నీ కలిపి గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఆలస్యమవుతోంది. కనీసం వారం వరకు గ్యాస్ డెలివరీ జరగడం లేదు.
కమర్షియల్ కష్టాలు
కమర్షియల్ సిలిండర్ల వినియోగదారులకు కష్టాలు పెరిగాయి. ఇప్పటికే వారికి కొరత ఉంది. ముఖ్యంగా హోటల్స్పై ఈ ప్రభావం పడింది. దీంతో పాటు ప్రభుత్వ ప్రైవేటు వసతి గృహాలు, రెసిడెన్సియల్ విద్యాసంస్థల వారు ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల కట్టెల పొయ్యిలు వెలిశాయి.
ఎల్పీజీ కొరత..
గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తుంటే.. వాహనాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ కేవలం వారం రోజుల వ్యవధిలోనే లీటరుకు రూ.30 పెరగడం భయపెడుతోంది. జిల్లా వ్యాప్తంగా 67 ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే జాతీయ రహదారి 193 కిలోమీటర్లు ఉండడంతో దాదాపు ఓ 30 బంకుల్లో ఎల్పీజీ సైతం విక్రయిస్తున్నారు. ఎల్పీజీ వాహనాలు ఉండడంతో రోజుకు దాదాపు 20 వేల వరకూ లీటర్ల ఎల్పీజీ అమ్మకాలు జరుగుతాయని సమాచారం. యుద్ధం ప్రారంభానికి ముందు లీటరు ఎల్పీజీ రూ.55 వరకూ ఉండేది. కానీ ప్రస్తుతం రూ.85కు చేరుకోగా.. మరో రెండురోజు ల్లో రూ.100లకు ఎగబాకడం ఖాయమని వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు ఎల్పీజీ గ్యాస్ వినియోగంపై రూ.75 లక్షల వరకూ అదనపు భారం పడుతోంది. అయితే ఇటీవల ఎల్పీజీ గ్యాస్ వాహనాలు తగ్గి ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది.


