● గుట్టుగా ఇసుక నిల్వ చేస్తున్న వైనం
ఇచ్ఛాపురం రూరల్: ఇసుకాసురులకు బాహుదా నది బంగారు బాతుగా మారిపోయింది. ఈదుపురం, కేశుపురం, సన్యాసిపుట్టుగ, చిన్న బూర్జపాడు, పెద్ద బూర్జపాడు, డొంకూరు, లక్ష్మీపురం తీర ప్రాంతం వరకు బాహుదానది పరివాహక ప్రాంతం వరకు ఇసుక అక్రమ తవ్వకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. స్థానికుల ప్రకారం కొందరు అక్రమార్కులు పగలంతా నది తీర ప్రాంతంలో ఇసుకను తవ్వి నిల్వ చేసి, తర్వాత ట్రాక్టర్ల ద్వారా మొగలి డొంకల్లోని రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాత్రి సమయంలో ఇసుక పోగుల్ని ఇతర ప్రాంతాలకు అమ్మకాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని, దీంతో నది గర్భం రోజురోజుకు లోతుగా మారుతోంది. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదీ తీర ప్రాంతం క్రమంగా కుంగిపోతుందనే భయం వ్యక్తమవుతోంది. ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


