శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వంలో రైతు సదస్సులు, విద్యా సదస్సులు నిర్వహించరు గానీ ఈవెంట్లకు మాత్రం రూ.కోట్లు ఖర్చు చేస్తారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) దుంపల లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా ఈవెంట్ కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. డీఎస్సీ–2024కి ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే క్రమంలో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్లకు అయ్యే ఖర్చు సగటున రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఉంటోందన్నారు. ఇలా అనేక విధాలుగా ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిధులను వ్యవసాయ రంగానికి లేదా విద్యా రంగానికి లేదా మెడికల్ కళాశాలల అభివృద్ధి కోసం ఖర్చుచేస్తే అన్నివర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇలానే పాలన సాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


