సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ పంచాయతీ పాలనాయుడుపేటలో ఎల్పీ నంబర్ 324, 325లో వేసిన లే–అవుట్లో ఆక్రమణలను రెవెన్యూ, పంచాయతీ అధికారులు గుర్తించారు. రియల్ దందా అనే శీర్షికతో ఆదివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం మండల సర్వేయర్ సుభాష్ ఆధ్వర్యంలో లే అవుట్ను పరిశీలించి సర్వే చేశారు. గ్రామ కంఠంకు సంబంధించి 7 సెంట్లు, వంశధార కాలువకు సంబంధించి 2 సెంట్లు కలిపి మొత్తం 9 సెంట్లు ఆక్రమణలకు గురైనట్లు తేల్చారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని మార్కింగ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పాడ ఉమాపతి, విలేజ్ సర్వేయర్ త్రిమూర్తులు ఉన్నారు. కాగా ఎల్పీ నంబర్ 324, 325లో భూములు కోర్టు పరిధిలో ఉన్నాయని, దీనిపై క్రయ, విక్రయాలు చేయకూడదని పీజీఆర్ఎస్లో కె.కుసుమారెడ్డి ఫిర్యాదు చేశారు.


