● ఇద్దరికి గాయాలు
సారవకోట: మండలంలో అలుదు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 326–ఏ పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామానికి చెందిన మజ్జి నరేంద్ర (24) మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలంలోని కొయ్యాం నుంచి పెళ్లి కబుర్లు చెప్పేందుకు సారవకోట వైపు ద్విచక్ర వాహనంపై మజ్జి నరేంద్ర, మజ్జి అప్పలనాయుడు వెళ్తున్నారు. అదే సమయంలో పాతపట్నం మండలంలోని సీది నుంచి ఆటోలో గేదెల వరలక్ష్మి, ఆటో డ్రైవర్ కృష్ణ సారవకోట మండలంలోని వడ్డినవలస వెళ్తున్నారు. అలుదు గ్రామం రెల్లివీధి సమీపంలో జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో మజ్జి నరేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే మజ్జి అప్పలనాయుడుతో పాటు ఆటోలో ఉన్న వరలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో నరేంద్ర, అప్పలనాయుడు, వరలక్ష్మిలను 108 వాహనంలో నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. నరేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు.


