రోడ్డుపై విద్యార్థుల నిరసన
ఆమదాలవలస: మండలంలోని దన్నానపేట గ్రామం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అలికాం – బత్తిలి ప్రధాన రహదారిపై శనివారం బైఠాయించి నిరసన తెలపడంతో కొద్దిసేపు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ప్రతిరోజూ కళాశాలకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు విపరీతమైన రద్దీతో వస్తుండడంతో ఆర్టీసీ డ్రైవర్లు స్టేజీల వద్ద ఆపకుండా వెళ్లిపోతున్నారని వాపోయారు. దీంతో సమయానికి కళాశాలకు చేరుకోలేక చదువుకు ఆటంకం కలుగుతోందన్నారు. కళాశాల ముగిసిన తర్వాత కూడా హిరమండలం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులు, అలాగే శ్రీకాకుళం నుంచి హిరమండలం వైపు వెళ్లే బస్సులు కళాశాల స్టేజీ వద్ద ఆగకపోవడంతో ప్రైవేట్ ఆటోలు, ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలిసిన ఆమదాలవలస ఎస్ఐ సనపల బాలరాజు సిబ్బందితో అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. జిల్లా ఆర్టీసీ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.


