పలాస జామి జాతరలో.. నకిలీ పాసుల కలకలం
పలాస : పలాస జామి జాతరలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన పాసుల్లో నకిలీవి సైతం చోటు చేసుకున్నాయనే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షకు పైగా యాత్రికులు, భక్తులు తరలివచ్చిన ఈ యాత్రకు రెండు రకాలు పాసులు ప్రజల్లోకి వెళ్లాయి. ఓ పాసు వెనుక వైపు పచ్చని అక్షరాలు, మరో పాసు వెనుక వైపు నీలం రంగు అక్షరాలు ఉన్నాయి. ఇందులో నీలం రంగు అక్షరాలు ఉన్నవి నకిలీవని గుర్తించి వాటితో వచ్చిన వారిని ఆలయం వద్ద నిర్వాహకులు అడ్డుకున్నారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు బమ్మిడి సంతోష్కుమార్కే ఇదే అనుభవం ఎదురైంది. తనతో పాటు మరికొంతమందికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఈ పాసులు ఇచ్చారని చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో ఫోన్పే చేసి దర్శనం టికెట్ కొనుక్కొని వెళ్లారు. ఆ సమయంలో నిర్వాహకులు రశీదు ఇవ్వకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి చాలామందికి ఎదురైంది. వాస్తవానికి ఒరిజినల్ పాసులకు ఎటువంటి రుసుం లేదు. కానీ, కొందరు నకిలీ పాసులు ముద్రించి సులువుగా దర్శనం అయిపోతుందని చెప్పి అమ్ముకున్నట్లు తెలిసింది.
పలాస జామి జాతరలో.. నకిలీ పాసుల కలకలం


