వసతి గృహాల్లో నీరుత్సాహ వైఖరి..
● జిల్లా కేంద్రంలో భయం గుప్పిట్లో హాస్టల్ విద్యార్థులు
● శుద్ధజలం అందక ఇక్కట్లు
● వార్డెన్లతో సమావేశమైనా
నిర్వహించని ఉన్నతాధికారులు
శ్రీకాకుళం పాతబస్టాండ్:
జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలుతుంటే.. హాస్టల్ విద్యార్థులు వణికిపోతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ తమకు శుద్ధమైన తాగునీరు ప్రశ్నార్థకంగానే ఉందని విద్యార్థులు చెబుతున్నారు. సంబంధిత శాఖాధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండడంతో వసతి గృహ విద్యార్థులు అతిసారం బారిన పడుతున్నారు. శుక్రవారం కొందరు విద్యార్థులకు డయేరియా సోకినట్లు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ పరిధిలో ప్రీ మెట్రిక్లో బాలురు వసతి గృహం ఒకటి ఉంది. కళాశాల పరిధిలో బాలికలకు నాలుగు, బాలురకు రెండు వసతి గృహాలు ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో కళాశాల స్థాయిలో పురుషులకు రెండు, మహిళలకు మూడు వసతి గృహాలు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రీ మెట్రిక్లో బాలురుకి ఒకటి, కళాశాల మహిళా వసతి గృహాలు రెండు, పురుషుల వసతి గృహాలు రెండు ఉన్నాయి. వీటిలో పాటు గురుకులాలు ఉన్నాయి.
తాగునీరు ఉందా..?
జిల్లా కేంద్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో తాగునీరు దొరకడం లేదు. దీంతో వారు నగర పాలక సంస్థ కుళాయిలు, బోర్లపైనే ఆధారపడుతున్నారు. అయితే ఇటీవల నగరంలో పైప్లైన్లు లీక్ కావడంతో నీరు స్వచ్ఛత లేకుండాపోయింది. దీంతో నగర వాసులతో పాటు వసతి గృహ విద్యార్థులు కూడా నగర పాలక సంస్థ పంపిణీ చేసిన తాగునీటినే వాడడంతో విద్యార్థులు అస్వస్థతకు గుర య్యారని తెలుస్తోంది. ఆపత్కాలంలోనైనా ట్యాంకర్ల నీటిని వినియోగించాల్సి ఉన్నా వార్డెన్లు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
పర్యవేక్షణ లోపం
ఈ వసతి గృహాలను పర్యవేక్షించాల్సిన ఆ శాఖ ఉన్నతాధికారిణి కేవలం కార్యాలయం పనులు, వారి సొంత పనులు తప్ప సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు కనీసం వార్డెన్లకు సమావేశం నిర్వహించి తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర వసతులపై మాట్లాడిన సందర్భమూ లేదు.
దీంతో బీసీ, ఇతర సంక్షేమ వసతి గృహాల్లో నిర్లక్ష్యం తాండవిస్తోంది. హాస్టల్ పిల్లలు కూడా రోజూ నగరంలో ఇతర పనులకు వెళ్తున్నట్లు సమాచారం. పర్యవేక్షణ లోపం వల్ల పిల్లలు కేటరింగ్ పనులకు వెళ్తున్నా పట్టించుకోవడం లేదు.
వసతి గృహాల్లో నీరుత్సాహ వైఖరి..


