కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలని, లేకుంటే సమ్మె తప్పదని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే పార్కు వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, ఆర్.ప్రకాశరావు, ఎ.రాజు, అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు పి.లతాదేవి, బి.జ్యోతి, పి.భూలక్ష్మి, బి.సునీత, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


