బాధ్యులు ఒకరు.. చర్యలు మరొకరిపై!
● శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్పై సస్పెన్షన్ వేటు
● డయేరియా ఘటనకు బాధ్యుడిని చేస్తూ చర్యలు
● రెండు వారాల కిందటే వచ్చిన అధికారి
● డయేరియాకు బాధ్యులైన అధికారులపై ఉదాసీనత
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలడంతో నగరపాలక కమిషనర్ హనుమంతు కూర్మారావును బాధ్యుడిని చేస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. కానీ ఆయన రెండు వారాల కిందటే బాధ్యతలు తీసుకోవడం గమనార్హం. పరిస్థితులు అర్థం చేసుకునేలోగానే ఆయనను బలి చేశారు. తమకు కావాల్సిన వారిని కాపాడుకోవడానికి మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేశారనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది. మంగళవారం రాత్రంతా విధుల్లో ఉన్న కమిషనర్ కూర్మారావు బుధవారం ఉదయం 5.53గంటలకు కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చేసరికి సస్పెన్షన్ ఉత్తర్వులు టేబుల్ మీద ఉన్నాయి. ఆయన స్థానంలో విశాఖపట్నం ఆర్డీ వి.రవీంద్రను ఇన్చార్జిగా నియమించడంతో కూర్మారావు హుటీహుటీన విధుల నుంచి తప్పుకున్నారు.
రెండు వారాలు కాకముందే
హనుమంతు కూర్మారావు ఫిబ్రవరి 11వ తేదీన కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. విధుల్లోకి వచ్చి రెండు వారాలు కూడా పూర్తి కాలేదు. వచ్చిన దగ్గరి నుంచి కార్పొరేషన్పై అవగాహన పెంచుకుంటున్నారు. వార్డు పర్యట నలు చేస్తున్నారు. ఇంతలో డయేరియా ప్రబలింది. కారణాలు అన్వే షించి, అదుపులోకి తెచ్చేందుకు తనవంతు ప్రయ త్నం చేస్తున్నారు. కానీ ఆయనపై వేటు వేశారు.
బాధ్యులు వారు కాదా?
డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరు కలుషితమే. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన వ్యవహారం. దీన్ని పర్యవేక్షించాల్సింది మున్సిప ల్ హెల్త్ ఆఫీసర్. ఆయన పనితీరుపై ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారన్న వాద నలు ఉన్నాయి. తాగునీరు కలుషితమే ప్రధాన కారణమైతే దానికి బాధ్యులైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తాగునీరు కలుషితం కావడానికి పైపులైన్లు కారణమైతే, దానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇక్కడదేమి చేయకుండా రెండు వారా ల క్రితం వచ్చిన కమిషనర్ కూర్మారావుపై చర్యలు తీసుకుంది. ఇప్పుడిదే నగరంలో చర్చనీయాంశంగా మారింది.
అసలైన బాధ్యుల వెనక ఎవరున్నారు..?
కమిషనర్ను బలి చేసి, మిగతా అధికారులను కాపాడుతున్నదెవరు? అన్నదానిపై ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది. డయేరియా ప్రబలడానికి కారణమైన శాఖలకు చెందిన అధికారులపై కనీసం చర్యలు తీసుకోకపోవడం వెనక మంత్రుల హస్తం ఉందన్న వాదనలు ఉన్నాయి.
సదరు అధికారులకు పెద్దల అండదండలు ఉండటంతో ఇష్టారీతిన వ్యవహరించడమే కాకుండా తనది కాని వాటిలో తల దూర్చి పెత్తనం చెలాయిస్తారన్న ఆరోపణలూ ఉన్నాయి. తాజా చర్యలు ఆ ఆరోపణలకు బలం చేకూర్చాయి.
బాధ్యులు ఒకరు.. చర్యలు మరొకరిపై!


