జామి ఎల్లమ్మ తల్లి
కోర్కెలు తీర్చే కల్పవల్లి..
● పలాసలో జామి జాతర రేపు ● నేటి రాత్రి కుంకుమ పూజలతో ప్రారంభం ● లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
పలాస: కోర్కెలు తీర్చె కల్పవల్లిగా, రోగాలు నయం చేసే ధన్వంతరి మాతగా, సంతతి ప్రసాదించే సంతాన లక్ష్మిగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న జామి ఎల్లమ్మ తల్లి జాతర పలాసలో గురువారం జరగనుంది. బుధవారం రాత్రి కుంకుమ పూజలు అనంతరం గురువారం ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. రాత్రి 11 గంటల వరకు జరిగే ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి ఒడిశా నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. తర్లాకోట జమిందారుల కాలం నుంచి జామి ఎల్లమ్మ జాతర సంప్రదాయబద్ధంగా కొనసాగుతోంది.దీనిలో భాగంగా మంగళవారం పలాస కొల్లకోట వంశీయుల ఆధ్వర్యంలో అగ్ని గుండం నిర్వహించారు. ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉదయం పందిరి రాట వేసి యాత్ర ప్రారంభ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. దేవాలయంలో పూజలు అనంతరం అమ్మవారి జంగిడి ,మేళతాళాలతో పట్టణ పొలిమేర వరకు ఆటపాటలతో వెళ్లి అక్కడినుంచి వాహనంలో తర్లాకోట జమిందారుల ఇంటికి వెళ్లారు. అక్కడ అగ్నిగుండం తొక్కి మొదటి పడి కింద జమిందారుల ఇంటి నుంచి బియ్యం సేకరించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు అమ్మవారికి పూజలు చేస్తారు. రాత్రి 9గంటల తర్వాత కొల్లకోట వంశీయులు ఆలయంలోనే భోజనాలు పూర్తి చేసి రాత్రి 11 గంటల నుంచి అమ్మవారి ఎదుట పసుపు కొమ్ములతో సిందూరం పండిస్తారు. అనంతరం ఎల్లమ్మ, ఎర్నెమ్మ, పోతురాజు విగ్రహాలతో ఆలయం నుంచి తెల్లవారి వరకు ఊరేగింపు చేపడుతారు.
భారీ పోలీసు బందోబస్తు..
జాతర సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో కర్రలతో బారికేడ్లు నిర్మించేవారు. ఈసారి పలాస ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్ నుంచి ఆలయం వరకు ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ పర్యవేక్షణలో కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తన సిబ్బందితో ఏర్పాట్లు చేయించారు.
ట్రాఫిక్ మళ్లింపు..
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పలాస మొగిలిపాడు నుంచి పలాస లోపలకు వాహనాలు రాకుండా నిషేధం విధించామని డీఎస్పీ తెలిపారు. మొగిలిపాడు నుంచి హైవే మీదుగా కోసంగిపురం కూడలి నుంచి కాశీబుగ్గలోకి పంపిస్తామన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
జామి ఎల్లమ్మ తల్లి
జామి ఎల్లమ్మ తల్లి


