అప్డేట్.. క్లిక్ చేస్తే ఔట్
శ్రీకాకుళం క్రైమ్ : ‘మీ బ్యాంకు నుంచి కేవైసీ అప్డేట్ చేయాలనే మెసేజ్ వచ్చిందా..? పాత బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మర్చిపోయారా..? చెక్కుల క్లియరెన్సు సులువుగా ఒకే రోజులో జరగాలా..? అయితే మీరు చేయాల్సిందల్లా కిందన ఉన్న లింక్లు క్లిక్ చేస్తే చాలు.. కదలకుండా ఇంటి వద్దనుంచే మీరు అన్నీ చేసేసుకోవచ్చు..’
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట జిల్లాలోని పలువురి ఫోన్లకు వాట్సాప్ల ద్వారా నిత్యం వస్తున్న ఫేక్ సందేశాలివి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా క్లిక్ చేసినా మన బ్యాంకు ఖాతాలోని సొమ్ము ఖాళీ అయిపోతుంది. ఇలాంటి ఫేక్ మెసేజ్లు, ఫేక్ లింక్లపై ఖాతాదారులైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు వర్గాలతో పాటు పోలీసులూ హెచ్చరిస్తున్నారు.
కేవైసీ అప్డేట్ అంటూ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (9930991935 నంబర్) పేరిట.. చింతించకండి.. బ్యాంకింగ్ సేవలను అంతరాయం లేకుండా పొందడంలో సహాయపడుతుంది అంటూ సందేశాలు వస్తాయి. ‘ఆధార్ ఓటీపీ, ఆధార్ ఇ–కేవైసీ, వీడియో కేవైసీ, మీ బ్యాంకు యందు అప్డేట్ చేయబడిన అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రాలను (ఓవీడీ) సమ ర్పించడం.. మరింత సమాచారం కోసం హెచ్టీటీపీఎస్://ఆర్బిఐకెఇహెచ్టిఎహెచ్ఐ.ఆర్బిఐ.ఒఆర్జి.ఇన్/టిఈల్యుజియు/ఇండెక్స్.హెచ్టీఎంఎల్ పై క్లిక్ చేయండి’ అంటూ పంపిస్తారు. పా త బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మర్చిపోయారా.. తిరిగి పొందడంలో ఆర్బీఐ మీకు సహాయం చేస్తుంది.. మీ లేదా మీ కుటుంబం యొక్క ఖాతా పదిసంవత్సరాలు పైన వాడకుండా ఉంటే అందులో డబ్బులుంటే ఆర్బీఐ యొక్క డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్లో ఉండొచ్చు. అంటూ లింక్ ఇస్తారు. కొద్దిగంటల్లో చెక్కులు క్లియర్ అయ్యి ఖాతాకు జమ అవుతాయి. మీరు చేయాల్సిందల్లా లింక్ను క్లిక్ చేస్తే చాలంటారు. చేశారో.. ఇక మీరు మోసపోయినట్లే.
ఫ్రాడ్కు గురైతే..
ఒకవేళ లింక్ క్లిక్ చేసి ఖాతాలో సొమ్ము పోగొట్టుకుంటే సంబంధిత బ్యాంకుకు వెళ్లి అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని, 1930 సైబర్సెల్కు ఫిర్యాదు చేయాలని, దగ్గరలో ఉన్న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదయ్యేలా చూడాలని పోలీసులంటున్నారు. సైబర్ వెబ్పోర్టల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
ఇలా వస్తాయి మెసేజ్లు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
ఇండియా పేరిట
వాట్సాప్ సందేశాలు
క్లెయిమ్ చేయని డిపాజిట్లను
తనిఖీ చేసేందుకు లింక్
చెక్కుల క్లియరెన్సు సులభతరమంటూ ఫేక్ లింకులు
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసు, బ్యాంకు వర్గాలు
బ్యాంకు అధికారులు ఏమంటున్నారంటే..
ఏ బ్యాంకు గానీ, రిజర్వ్ బ్యాంకు గానీ కేవైసీ అప్డేట్ చేస్తామంటూ లింక్లు ఎట్టి పరిస్థితు ల్లో పంపదని, అలా పంపిందంటే అదో ఫేక్ మెసేజ్గా పరిగణించాలని, సైబర్ ఫ్రాడ్కు గురయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఒకవేళ సంబంధిత బ్యాంకు అధికారిక వెబ్సైట్నుంచి గానీ, అధికారిక కాల్సెంటర్ కస్టమర్ కేర్ నుంచి గానీ మెయిల్, సందేశాలు పంపినా ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ బ్రాంచి అని చెబుతారన్నారు. ఇలాంటి లింక్లు పంపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదని, దగ్గరలో ఉన్న బ్యాంకు ప్రతినిధులను సంప్రదించాలంటున్నారు.
అప్డేట్.. క్లిక్ చేస్తే ఔట్
అప్డేట్.. క్లిక్ చేస్తే ఔట్


