బొత్సను హేళన చేయడం సరికాదు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): తూర్పుకాపుజాతి అభ్యుదయవాది, మాజీ మంత్రి, శాశన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణపై కిరాక్ ఆర్పీ అనే నటుడు వ్యక్తిగతంగా, వ్యంగంగా మాట్లాడిన విధానం ఆక్షేపనీయమని ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ తీవ్రంగా ఖండించారు. జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే శ్రీకాకుళం జిల్లా వేదికగా తూర్పుకాపుజాతి ఆత్మగౌరవ భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా తూర్పుకాపు జాతిని ఏకతాటిపైకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పుకాపుజాతి కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం నూతన కార్యాచరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కొబగాపు గౌతమ్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలకు, అన్ని మండలాలకు, నూతన కార్యవర్గాలను వెంటనే నియమించాలన్నారు. తూర్పుకాపుల్లో ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో సంఘం జాతీయ గౌరవాధ్యక్షుడు పతివాడ గిరీశ్వరరావు, జాతీయ కార్యదర్శి మామిడి విష్ణుమూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లుకలాపు సంతోష్, రాష్ట్ర కార్యదర్శి మత్స బుచ్చిబాబు, ఉద్యోగ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడవలస సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


