పాముకాటుతో వ్యక్తి మృతి
జలుమూరు: మండలంలోని పర్లాం పంచాయతీ పరిధి యాతపేటకు చెందిన వాడ సింహాచలం(50) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందాడు. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఉదయం ఎప్పటిలాగే పొలానికి వెళ్లిన సింహాచలం వరిచేను కోస్తుండగా విషపూరితమైన పాము కాటు వేసినట్లు గుర్తించాడు. వెంటనే ఆయనను సైరిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేస్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో మృతి చెందినట్లు కుమారుడు వాసు తెలిపారు. మృతుడికి భార్య పుణ్యావతి, కొడుకు, కుమార్తె ఉన్నారు.
వివాహిత ఆత్మహత్య
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రంలోని కాకివీధిలో సోమవారం ఒక వివాహిత మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాకివీధిలో నివసిస్తున్న రేపాక ఈశ్వరరావు నగరంలోని ఒక స్వీట్స్ దుకాణంలో పనిచేస్తున్నాడు. భార్య లలితారాణి (28), ఇద్దరు కుమార్తెలతో నివసిస్తున్నాడు. కాగా గత కొద్దిరోజులుగా లలితారాణి ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆదివారం రాత్రి కాస్తా మందలించారు. దీంతో సోమవారం వేకువజామున వాస్మాల్ ద్రావణం తాగేసింది. ఇది గమనించిన భర్త వెంటనే రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లలితారాణి మృతి చెందింది. లలితారాణి తండ్రి లావేటి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామారావు కేసు నమోదు చేశారు.
వీసీకి జీవితకాల సాఫల్య పురస్కారం
ఎచ్చెర్ల: విద్యా, పరిశోధన రంగానికి నాలుగు దశాబ్ధాలుగా చేసిన సేవలను గౌరవిస్తూ డాక్టర్ బీఆర్ఏయూ వీసీ ఆచార్య కేఆర్ రజనీకి జీవితకాల సౌఫల్య పురస్కారంతో ఐఈఎఫ్ (ఆస్ట్రేలియా) సత్కరించింది. సోమవారం జరిగిన సీపీ బ్రౌన్ జయంతి సందర్భంగా ఈ అవార్డును ఫోరమ్ ప్రతినిధులు అందజేసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా హెచ్సీజీ క్యాన్సర్ హాస్పిటల్ కమ్యూనిటీ కనెక్ట్ ఎగ్జిక్యూటివ్ పిల్లా రూపాశ్రావణి (విశాఖ)కు విశిష్ట సేవారత్న, కూచిపూడి, భరతనాట్యం కళాకారిణి పి.సాయిహర్ష ప్రియకు నాట్య కళారత్నా అవార్డులతో సత్కరించారు.
ఆత్మహత్య కేసులో ఇద్దరు అరెస్టు
నందిగాం: మండలంలోని తురకులకోటలో ఆత్మహత్యకు పాల్పడ్డ మేఘవరపు వెంకటరావు కేసుకు సంబంధించి ఇద్దరిని ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్లు ఎస్ఐ షేక్మహ్మద్ ఆలీ సోమవారం తెలిపారు. ఆత్మహత్య కేసులో వేధింపులకు గురిచేసిన బంకు యజమాని బగాది రమేష్, అతనికి సహకరించిన వజ్రపుకొత్తూరు పోలీస్స్టేషన్ హెచ్సీ కోరాడ ఈశ్వరరావులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. టెక్కలి ఇన్చార్జి జడ్జి 15 రోజుల రిమాండ్ విధించడంతో నరసన్నపేట సబ్ జైల్కు తరలించారు.
ఇదేం విడ్డూరం..!
సాక్షి టాస్క్ఫోర్స్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లలో పదవులను సోమవారం ప్రకటించింది. దీనిలో భాగంగా నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్లుగా 11 మందిని నియమించారు. అందులో పాతపట్నం నియోజకవర్గానికి చెందిన అక్కందర సన్యాసిరావు, బుర్లే లలితకుమారికి పదవులు వరించాయి. అయితే బుర్లే లలిత కుమారి తూర్పు కాపు కులానికి చెందిన మహిళ కావడంతో ఇదేం విడ్డూరమని పలువురు గుసగసలాడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు మేరకే అధిష్టానం పదవులు ఇవ్వడం జరుగుతుందని కానీ ఎమ్మెల్యేకు అవగాహన లేకపోవడం ఏంటని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.
పాముకాటుతో వ్యక్తి మృతి


