పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
శ్రీకాకుళం అర్బన్: కార్తీకమాసం సందర్భంగా పంచారామాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు కోరారు. పంచారామాలకు వెళ్లే ఆర్టీసీ సూపర్లగ్జరీ బస్సును శ్రీకాకుళం బస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీకమాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. సోమవారం పంచారామాలను దర్శించుకుని మరలా మంగళవారం ఉదయం 6గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుతుందని వివరించారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని శివాలయాలను దర్శించుకోవచ్చన్నారు. ఈ నెల 9, 16 తేదీల్లో కూడా బస్సులు నడుపుతామన్నారు. ‘ఒక్క ఫోన్ కాల్ తో మీ వద్దకు ఆర్టీసీ బస్సు’ అనే నినాదంతో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 99592 25608, 99592 25609 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్ఎం ఎంపీ రావు, అధికారులు రాజు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.


