రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కవిటి: మండలంలోని జగతి హనుమాన్ జంక్షన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొడివాటి శివాజీ(25) అనే యువకుడు దుర్మరణం చెందాడు. కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీ భారత్ గ్యాస్ ఏజెన్సీలో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. విధినిర్వహణలో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కవిటి నుంచి సోంపేట రోడ్డులో వెళుతుండగా జగతి గ్రామం మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోవడంతో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వెల్లడయ్యాక పూర్తివివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. శివాజీ స్వగ్రామం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దమానాపురం. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రవివర్మ తెలిపారు.


