
టీడీపీ అరాచకాలకు మూల్యం చెల్లించక తప్పదు
సరుబుజ్జిలి : టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలకు ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోకతప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ హెచ్చరించారు. రాజకీయ కారణాలతో చిగురువలస కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త జరుగుళ్ల రాజారావు ఇంటిని కూటమి నేతలు కక్షకట్టి కూల్చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రవికుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూల్చివేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు తుంగలోకి తొక్కిందని, ఇదేంటని ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అధికార పక్ష ప్రధాన నేతలు లిక్కర్, ఇసుక, భూదందాలతో అక్రమంగా సంపదిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు, ఉద్యోగాలు, పింఛన్ల తొలగింపు తప్ప నియోజకవర్గానికి ఒరిగిందేమిలేదన్నారు. ఇప్పటికై నా అధికార పక్షనేతలు కక్షపూరిత రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సురవరపు నాగేశ్వరరావు, డకరవలస సర్పంచ్ సురవరపు తిరుపతిరావు, పార్టీ నేతలు అత్తులూరి రవికాంత్, కొవిలాపు చంద్రశేఖర్, మెట్ట నందేశు, కెప్టెన్ రామారావు, చల్ల యర్రయ్య, పల్లి శాంతారావు, ముద్దాడ రంజిత్, దనాల చిరంజీవి, బేపల రవి పాల్గొన్నారు.