పావగడ: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లోని గౌడేటి గ్రామం దుర్గమ్మ గుడి వద్ద నివసిస్తున్న గంగమ్మ (80)ను సొంత మనవడు నరసింహమూర్తి హత్య చేసిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గంగమ్మను నరసింహమూర్తి మద్యం సేవించడానికి డబ్బు అడిగాడు. ఆమె నిరాకరించగా చంపేస్తానని బెదిరించాడు. అయినా భయపడకపోవడంతో కోపోద్రిక్తుడై చపాతి కర్రతో అవ్వ తలపై మోదాడు. చుట్టు పక్కల జనం సాయంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మధ్యాహ్నం మెరుగైన చికిత్స కోసం తుమకూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. నిందితుడు నరసింహమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక జేఎంఎఫ్పీ కోర్టులో హాజరు పరచి జడ్జి ఆదేశాల మేరకు 15 రోజుల రిమాండుకు తుమకూరు జైలుకు తరలించారు.


