పుట్టపర్తి : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్లన్నీ పక్కాగా చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ విజయలక్ష్మి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆమె బుక్కపట్నం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. కార్యాలయ గదులు, ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇలాగేనా ఉండేది.. అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తప్పిదాలను సహించబోనన్నారు. కార్యాలయంలో మౌలిక వసతులు, సిబ్బంది కొరత గురించి విలేకరులు ఆమె దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డీఐజీ వెంట జిల్లా రిజిస్ట్రార్ కృష్ణకుమారి, సిబ్బంది ఉన్నారు.
‘సర్’ పర్యవేక్షక అధికారుల నియామకం
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను ఎన్నికల కమిషన్ నియమించింది. అన్ని జిల్లాలకూ పర్యవేక్షక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ శుక్రవారం జారీ చేశారు. అనంతపురం జిల్లా పర్యవేక్షక అధికారిగా మిషన్ ఫర్ క్లీన్ కృష్ణ, గోదావరి కెనాళ్ల మేనేజింగ్ డైరెక్టర్ జి.క్రిస్ట్ కిషోర్కుమార్ను నియమించారు. శ్రీసత్యసాయి జిల్లా పర్యవేక్షక అధికారిగా హార్టికల్చర్, సెరికల్చర్ డైరెక్టర్ కె.శ్రీనివాసులును నియమించారు.


