ధర్మవరం: ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని సివిల్ సప్లయీస్ గోడౌన్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లోని భౌతిక స్టాక్కు, రికార్డుల్లో ఉన్న నిల్వకు తేడా ఏమైనా ఉందా? అని పరిశీలించారు. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల నాణ్యతను తనిఖీ చేశారు. గోడౌన్లో సరుకులు పాడవకుండా ఉండేందుకు తగిన గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు సరుకులను తరలించే వాహనాల వివరాలను, సమయ పాలనను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా సరుకులు పక్కదారి పట్టకుండా నిఘా ఉంచాలన్నారు. అనంతరం తమకు రావాల్సిన కూలి, లోడింగ్, అన్లోడింగ్, చార్జీల చెల్లింపులు, గోడౌన్లో కనీస సౌకర్యాల కల్పన తదితర సమస్యలను హమాలీలు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. హమాలీల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. తహసీల్దార్ దేవరాజ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


