ప్రశాంతి నిలయం: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జాబితాలను ప్రదర్శనకు ఉంచినట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 19వ తేదీన గ్రామ సభలు నిర్వహిస్తామని, ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే దరఖాస్తు రూపంలో అందివ్వాలని సూచించారు. 19 నుంచి 24వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. కుల ధ్రువీకరణకు సంబంధించినవి తప్ప... తక్కినవన్నీ ఈనెల 26వ తేదీలోపు సవరించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కుల ధ్రువీకరణ పత్రంలో సవరణ కోసం అందిన దరఖాస్తులను సంబంధిత అధికారి ద్వారా మాత్రమే మార్పులు చేస్తారన్నారు. ప్రజలందరూ తమ కుటుంబ వివరాలు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జాబితాలో సరిచూసుకోవాలన్నారు.
జూలై 26న సత్యసాయి
రన్ అండ్ రైడ్
ప్రశాంతి నిలయం: సత్యసాయి స్ఫూర్తితో యువత సేవాగుణం అలవర్చుకునేలా జూలై 26న సత్యసాయి రన్ అండ్ రైడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 5కే రన్ అండ్ రైడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియం నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. శారీరక దృఢత్వం, ఐక్యత, నిస్వార్థ సేవ, సత్యసాయి బోధించిన మానవతా విలువలను యువతలో పెంపొందించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 5 కిలోమీటర్ల పరుగు, సైకిల్ రైడింగ్ ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు జూలై 19వ తేదీలోపు https://sssunityrun.ssssoindia.org వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి సర్టిఫికెట్తో పాటు టీషర్ట్, మెడల్స్ ప్రధానం చేస్తామన్నారు.


