బత్తలపల్లి: మొహర్రం ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి బత్తలపల్లిలోని ఖాశీంస్వామి ప్రథమ దర్శనం ఇచ్చారు. కులమతాలకు అతీతంగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని తరించారు. అంతకుముందు పీర్లను భద్రపరిచిన పెట్టెను గ్రామ పెద్దల సమక్షంలో కిందకు దించారు. ముజావర్లు ఫాతెహా నిర్వహించారు. అనంతరం ముజావర్లు కాశీంస్వామి ప్రథమ దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారిని కొలువుదీర్చనున్నారు. 21వ తేదీ వరకు నిత్యపూజ నివేదన, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ముజావర్లు తెలిపారు. బత్తలపల్లి సీఐ ప్రభాకర్గౌడు, ఎస్ఐ సోమశేఖర్ సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.


