బొమ్మనహాళ్: మండలంలోని తారకాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన కొల్లాపురి మహాలక్ష్మీ అమ్మవారి రథోత్సవంలో ఎద్దు బెదిరి కాలితో తన్నడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు మృతి చెందింది. ఏఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన మేరకు... తారకాపురం గ్రామానికి చెందిన కురుబ లక్ష్మీదేవి (90) అమ్మవారి రథోత్సవం చూడటానికి ఆలయం వద్దకు వచ్చింది. ఈ క్రమంలో ఎద్దు బెదిరి లక్ష్మీదేవి ముక్కుతో పాటు చేతిపై తన్నింది. కుటుంబ సభ్యులు ఆమెను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపారు. మృతురాలి కుమారై ఎర్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


