పుట్టపర్తి అర్బన్: ఖరీఫ్ సీజన్లో కూరగాయల పంటల సాగు ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే జిల్లాలో కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగు చేయడం ఆరంభించారు. జిల్లాలో 16 వేల హెక్టార్లకు పైగా కూరగాయల పంటల సాగు విస్తీర్ణం ఉంది. ఈ ఏడాది ఇప్పుడిప్పుడే ధరలు పెరుగుతుండడంతో కూరగాయల పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ముందస్తు వర్షాలు రావడంతో మొక్కలను బతికించుకోవచ్చని బోరుబావుల్లో నీళ్లు సమృద్ధిగా ఉన్న రైతులు కూరగాయల సాగు వైపు చూస్తున్నారు. అయితే ఎల్నినో ప్రభావం అధికంగా ఉందని శాస్త్రవేత్తలు ముందస్తు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం టమాటా, వంకాయ, మిర్చి, బెండ, చిక్కుడు తదితర పంటలు సాగు చేశారు. ప్రస్తుతం 3 వేల హెక్టార్లలోపు సాగు ఉందని ఉద్యాన అధికారులు చెప్తున్నారు. జూన్ చివరకు కూరగాయల సాగు పూర్తవుతుందని, పంట నమోదు పూర్తి చేస్తామని హెచ్ఓ నవీన్కుమార్ తెలియజేశారు.


